జగన్ నిర్ణయంపై కేంద్రం ఆందోళన: మంత్రి అనిల్ ఎక్కడ: ప్రభుత్వ ఇమేజ్ డామేజ్ అవుతున్నా..!
పోలవరం ప్రాజెక్టు నుండి నవయుగను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్ని బాధాకర ఘటనగా కేంద్ర జలశక్తి మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం కారణంగా పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటూ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుం దనే ఆందోళన వ్యక్తం చేసారు. పోలవరం నుండి నవయుగను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన రాజకీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ఇరిగేషన్ మంత్రి అనిల్ నోరు మెదపటం లేదు. కేంద్రం ప్రాజెక్టు పైనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే...ఇప్పటి వరకు మంత్రి ఎక్కడా తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదీ వివరించలేదు. పోలవరం నిర్మాణం పైన అనుమానాలను నివృత్తి చేయ టంలో మాట మాట్లాడటం లేదు. దీనిని ప్రతిపక్ష టీడీపీ మరింత అవకాశంగా మలచుకుంటోంది...
Recommended Video
ఏపీ నిర్ణయంపైన కేంద్రం ఆందోళన..
పోలవరం నుండి నవయుగను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. దీని పైన కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు. బాధాకరమైన నిర్ణయంగా దీనిని అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు భవిష్యత్కు అవరోధంగా మారటంతో పాటుగా..నిర్మాణ వ్యయం కూడా పెరుగు తుందని అంచనా వేసారు.టీడీపీ సభ్యుడు జయదేశ్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టుకు అవరోధంగా పేర్కొన్నారు. మున్ముందు ఎంత సమయం పడుతుందో చెప్పలేం. దీనివల్ల కచ్చితంగా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అంచనా వేసారు. ఇదే సమయంలో ఇప్పటివరకు దానిపై ఖర్చుచేసిన మొత్తం తిరిగి చెల్లించే విషయంలో కొన్ని ఆర్థికాంశాలపై అభ్యంతరాలున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. కుడి, ఎడమ కాలువల కోసం రూ.5వేల కోట్లు ఖర్చుపెట్టారు. అందుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టు సమర్పించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
అవకాశంగా మలచుకుంటున్న టీడీపీ..
రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో అవినీతి జరిగిందనే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నవయుగను తప్పించాలని నిర్ణయిస్తూ నోటీసులు ఇచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ రాజకీయ అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. దీని పైన ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమా వరుసగా మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ ద్వారా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయా న్ని తప్పు బట్టటం.. ప్రాజెక్టు సకాలంలో పూర్తి అవ్వటం పైన అనుమానాలు వ్యక్తం చేయటాన్ని ఇప్పుడు టీడీపీతో పాటుగా బీజేపీ సైతం ఆయుధంగా మలచుకోనున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాము నిర్ణయం తీసుకున్నాక ఆ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీకి నివేదించింది. పీపీఏ ఇప్పుడు కేంద్రానికి సమాచారం ఇవ్వటం..తమ అభిప్రాయన్ని జోడించటం మాత్రమే చేయగలదు.
మంత్రి అనిల్ ఎక్కడ...ఇంత జరుగుతున్నా..
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుండి నవయుగను తప్పిస్తూ నిర్ణయించింది. దీని పైన అధికారులు నోటీసులు ఇవ్వటం..ముఖ్య అధికారికి తనను సంప్రదించిన మీడియా సంస్థలకు వివరణ ఇవ్వటం మినహా ప్రభుత్వం నుండి అధికారికంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే దాని పైన స్పష్టత లేదు. టీడీపీ నేతలు దీని పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..ఆ నిర్ణయం వెనుక కారణాలను ప్రజలను వివరించాల్సిన మంత్రి అనిల్ ఇప్పటి దాకా దీని పైన స్పందించలేదు. ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం లేదు. ఒక వైపు వరద నీటితో పోలవరం వద్ద పరిస్థితి పైన అనేక రకాలుగా కధనాలు వస్తున్నాయి. పార్లమెంట్లోనూ ఇదే అంశం పైన కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటువంటి కీలక సమయాల్లో బాధ్యత తీసుకోవాల్సిన సంబంధింత మంత్రులు నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. అసలు దీని పైన అపోహలు తొలిగించాల్సిన మంత్రి అనిల్ ఎక్కడ అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పటికైనా మంత్రి అనిల్ స్పందిస్తారా..అపోహల పైన క్లారిటీ ఇస్తారా..చూడాలి ఏం చేస్తారో.