ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆ సూచన మేరకే: పోలవరంపై కూడా క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ ఉద్యమం మొదలైంది. ఇక టీడీపీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, సీఎం జగన్ ఆ పని చెయ్యాలని , విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో జగన్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అంతగా అవసరమైతే కేంద్రం నుండి రాష్ట్రం కొనుగోలు చేయాలని ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?
నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏపీలో ఇప్పుడు మరోమారు ఉక్కు ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. హైదరాబాద్ లో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటామని, ప్రతి పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని పేర్కొన్నారు .
నష్టాల్లో ఉన్న వాటిని మాత్రమే ప్రైవేటీకరణ చేస్తామన్న మంత్రి
నష్టాల్లో ఉన్న వాటిని మాత్రమే ప్రైవేటీకరణ చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో లఘు ఉద్యోగ్ భారతి ఆధ్వర్యంలో మేధావులు పారిశ్రామికవేత్తలతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ఆలోచన వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరగలేదని, కేంద్రం తెలుగు రాష్ట్రాలకు సైతం ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నాం
ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్న అనురాగ్ ఠాకూర్ బడ్జెట్ ను జాతీయ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల మూడుసార్లు తమను కలిశారని వెల్లడించిన ఆయన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఏపీకి బడ్జెట్ లో అన్యాయం జరిగిందని , అలాగే విశాఖ ప్రైవేటీకరణతో కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఏపీలో కేంద్రం తీరుపై నిరసనలు వెల్లువగా మారాయి.