తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటన;రూ.1337 కోట్ల సాయానికి కేంద్రం అంగీకారం
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపానుకు ధాటికి అతలాకుతమైన ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహీర్ పర్యటించారు.ఆయా ప్రాంతాల్లో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ తాకిడి కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు తక్షణ సాయంగా రూ.539 కోట్లు విడుదల చేయనున్నట్లు హన్స్రాజ్ ప్రకటించారు. తిత్లీ తుఫాన్ నష్టం పూడ్చుకునేందుకు కేంద్రాన్ని సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికను హోంశాఖ సమగ్రంగా సమీక్షించిందని కేంద్ర మంత్రి హన్స్ రాజ్ తెలిపారు.
శ్రీకాకుళంలో...కేంద్ర మంత్రి పర్యటన
తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సాయం చెయ్యాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో రూ.3,837 కోట్లు ఇవ్వాలని ఎపి ప్రభుత్వం పేర్కొనగా ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.1,337 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి హన్స్ రాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందులో రూ.539 కోట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని...మంత్రి సంతకం చేసిన వెంటనే డబ్బు విడుదల అవుతాయని హన్స్ రాజ్ వివరించారు.
అంత అడిగారు...ఇంత ఇస్తాం
అంతేకాకుండా నిబంధనల ప్రకారం డిసెంబర్ లో మంజూరు చేయాల్సిన ఎన్.డి.ఆర్.ఎఫ్ నిధులు రూ.229 కోట్లు అక్టోబరులోనే మంజూరు చేస్తున్నామని...అయితే ఆ ఆ మొత్తాన్ని తిత్లీ తుపాను ప్రాంతాలకే వినియోగించుకోవాలని రాష్ట్రానికి సూచించడం జరిగిందన్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు ఇచ్చిన పరిహారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చిన నిధులేనని హన్స్ రాజ్ తెలిపారు.
ఇలా కూడా...కేంద్రం సాయం
తిత్లీ తుపానుతో దెబ్బతిన్న సుమారు 45వేల ఇళ్ల స్థానంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఒక్కో ఇంటికి రూ.3.45 లక్షలు మంజూరు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందని హన్స్ రాజ్ చెప్పారు. అయితే ఇందులో రూ.2.50 లక్షలు కేంద్రం సమకూర్చగా...రూ.95 వేలు రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే తుపాను తాకిడి ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని యోచిస్తున్నామని...ఢిల్లీ తిరిగివెళ్లాక ఈ విషయమై చర్చించుకొని నిర్ణయాన్ని వెల్లడిస్తామని హన్స్ రాజ్ తెలిపారు.
అదే లేఖ...మంత్రికి అందచేత
తుఫాన్ తాకిడి ప్రాంతాల్లో పడిపోయిన చెట్లను తొలగించుకోవడానికి ఉపాధిహామీ పథకం కింద కేంద్రం నిధులు సమకూర్చనుందని...అలాగే ఈ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను కూడా 100 నుంచి 200లకు పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. అంతకుముందు వజ్రపుకొత్తూరు మండలంలోని ఉద్దాన గ్రామాలైన చినవంక, డోకులపాడులో తిత్లీ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన కేంద్రమంత్రి బాధిత రైతులతో మాట్లాడి సాయం ఎంత ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుంటే తుపాను సాయాన్ని కోరుతూ సిఎం చంద్రబాబు ప్రధానికి మోడీకి రాసిన లేఖ ప్రతిని రాష్ట్ర ప్రకృతి విపత్తుల సంచాలకులు ప్రసన్న వెంకటేశ్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్బాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ కి అందించారు.