ఇలాంటి నిర్మాణమా, ముందే తెలిస్తే వద్దనేవాడ్ని: పోలవరంలో కేంద్ర అధికారి
అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ నుంచి పలు బృందాలు వరుసగా పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చారు. పోలవరంలో ఎన్హెచ్పీసీ బృందం పర్యటించిన అనంతరం వాప్కోస్ బృందం వచ్చింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్ పర్యటించారు.
Recommended Video
ఆయన పర్యటనలో ఉండగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓఎస్టీ సంజయ్ ఖోలాపుల్కర్ వచ్చారు. త్వరలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రానున్నారు. జనవరి మొదటి వారంలో గడ్కరీ పర్యటించనున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును కేంద్రం తన ఆధీనంలోకి తీసుకునే కసరత్తు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది సరికాదు
శనివారం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం సరికాదని గడ్కరీ సాంకేతిక సలహాదారు సంజయ్ ఖోలాపుల్కర్ వ్యాఖ్యానించారు. గోదావరి వంటి ఇంత మహానదిలో అతుకులతో కాఫర్ డ్యాం నిర్మాణం సరికాదన్నారు.
ముందే తెలిస్తే వ్యతిరేకించేవాడ్ని
అసలు ఇలాంటి ప్రతిపాదన ఉందని తనకు ముందే తెలిసి ఉంటే అప్పుడే వ్యతిరేకించి ఉండేవాడినని సంజయ్ చెప్పారు. జాతీయ జల విద్యుత్తు పరిశోధన కేంద్రం(ఎన్హెచ్పీసీ) బృందం నివేదిక వచ్చిన వెంటనే తన వద్దకు వస్తే తక్షణమే అవసరమైన నిర్ణయాలు తీసుకునేలా చూద్దామన్నారు.
గడ్కరీ వస్తారు పరిష్కరించుకోండి
సరిపడా యంత్రాలు ఉన్నందున పనులు ఏవిధంగా వేగవంతం చేయాలన్న దానిపై ఇంజినీర్లతో ఈ సందర్భంగాసంజయ్ చర్చించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జల వనరులశాఖ అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. జనవరి మొదటి వారంలో గడ్కరీ పోలవరం ప్రాజెక్టు వద్దకు రానున్నారని చెప్పారు. అప్పటికి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
ప్రాజెక్టు ఎలా ముందుకు పోతుంది
డిజైన్లకు సంబంధించి ఆమోదాలు అప్పటి లోగా తెచ్చుకోవాలని సంజయ్ సూచించారు. ఇందుకు సంబంధించి అవసరమైతే కేంద్ర జలసంఘంతోను మాట్లాడదామన్నారు. పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్తో అదనపు పనులు చేయిస్తున్న సందర్భంలో వారికి క్లెయిమ్ల విషయంలో ఏదోలా న్యాయం చేయాలని, లేదంటే ప్రాజెక్టు ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు.
కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని సూచన
దీనిపై అధికారులు స్పందించారు. ఒప్పందం పరిధిలో ఏం చేయడానికైనా తాము సిద్ధమని, ఒప్పందం దాటి చేయడానికి వీలుపడటం లేదని ఈఎన్సీ, కార్యదర్శిలు తెలిపారు. కేంద్రమే ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. ప్రసుత్త కాంట్రాక్టర్కు జనవరి మూడో వారం వరకు గడువు ఇస్తున్నామని, ఈ లోపు కాంక్రీటు పనుల వేగం పెంచాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాతే కొత్త టెండర్లకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.