అంతా అయ్యాక వచ్చారా? ఇలా చూడండి (పిక్చర్స్)
హైదరాబాద్: ఫైలిన్ తుఫాను, వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందు కేంద్ర కరువు బృందం మంగళవారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. గుంటూరులో పర్యటించిన బృందం వరదల వల్ల రూ.1,178 కోట్లు నష్టం వాటిల్లిందని, 22 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు, రూ.42 కోట్ల నష్టమని ఈ సందర్భంగా కేంద్ర కరువు బృందానికి అధికారులు నివేదికను అందజేశారు.
కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి విశాఖలోను ఆయా గ్రామాలను పరిశీలించింది. తరచూ తుఫాన్ల కారణంగా తీవ్రంగా పంటనష్టపోతున్నప్పటికీ పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదంటూ పలు ప్రాంతాల్లో కేంద్ర బృందాన్ని రైతులు, ప్రజాప్రతినిధులు నిలదీశారు.
కేంద్ర హోంశాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి శంభూసింగ్, భోపాల్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు ఆర్పి సింగ్, కేంద్ర నీటివనరుల నిపుణుడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రమేష్కుమార్తో కూడిన కేంద్ర బృందం తాడేపల్లి మండలంలోని పెనుమాక, ప్రత్తిపాడు మండలంలోని వంగిపురం, అబ్బినేనిగుంటవారిపాలెం, పెదనందిపాడు మండలంలోని అప్పాపురం, జిల్లెళ్లమూడి, బాపట్ల మండలంలోని జమ్ములపాలెం, నర్సాయపాలెం గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించింది.
ఫైలిన్ 1
కేంద్ర బృందం గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఫైలిన్ ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. వారికి బాధితులు తమ బాధలను ఏకరువు పెట్టారు.
ఫైలిన్ 2
గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలోని రైతులు అడ్డుకుని ధర్నా చేశారు.
ఫైలిన్ 3
నీలం తుఫాన్ సంభవించి ఏడాది పైగా గడుస్తున్నప్పటికీ పరిహారం నేటికీ అందలేదన్నారు. తుఫాన్లు సంభవించిన నెల రోజుల తర్వాత పర్యటిస్తే నష్టం ఏ మేరకు జరిగిందో ఎలా అర్థమవుతుందంటూ దూళిపాళ్ల నిలదీశారు.
ఫైలిన్ 4
గుంటూరు జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని, తక్షణ సాయం అందించాలంటూ వినతిపత్రాన్ని బృందానికి దూళిపాళ్ల అందజేశారు.
ఫైలిన్ 5
గుంటూరు జిల్లా అప్పాపురంలో రైతులు బృందాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు నష్టపోయి పైరును పీకివేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏం పరిశీలిస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైలిన్ 6
గత నెల 22వతేదీనుండి 25వతేదీ వరకు జిల్లాపై అల్పపీడన ద్రోణి ప్రభావం తీవ్రంగా చూపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
ఫైలిన్ 7
గుంటూరు జిల్లాలోనే సుమారు 861కోట్లరూపాయల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లాయంత్రాంగం నివేదిక కూడా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపింది.
ఫైలిన్ 8
భారీ వర్షాలు కురిసి 28 రోజులు అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర బృందం మొక్కుబడిగా ఫైలిన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఫైలిన్ 9
కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ డైరక్టర్ శంభుసింగ్ నేత్రుత్వం వహించారు. ఈ బృందం ఫైలిన్ ప్రభావిత పలు ప్రాంతాల్లో పర్యటించనుంది.
ఫైలిన్ 10
భారీ వర్షాలు కురిసి 28 రోజులు తరువాత కేంద్ర బృందం వచ్చి ఏం లాభమని, ఈ పాటికే నష్టం జరిగిన పత్తి, వరిపంటలను పెరికి వేసి మళ్లీ ప్రత్యామ్నాయపంటలను వేసుకునేందుకు సమయాత్తమవుతున్నామని బాధితులు చెబుతున్నారు.
ఫైలిన్ 11
వరదల కారణంగా చెరువులకు, కాల్వలకు, రోడ్లకు పడిన గండ్లను ప్రజలు తాత్కాలిక అవసరాలకు వీలుగా గండ్లు పూడ్చుకున్నారు.
ఫైలిన్ 12
విశాఖపట్నం జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. ఈ సమయంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ వారికి ప్రభావాన్ని వివరిస్తున్న దృశ్యం.
ఫైలిన్ 13
నెల రోజుల క్రితం వచ్చిన ఫైలిన్, వరదల ప్రభావం వల్ల విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని రాజకోడూరు గ్రామంలో నేలపాలైన పంట దృశ్యం.
ఫైలిన్ 14
విశాఖపట్నంలోని అనకాపల్లి ఆర్డీవో కూలిపోయిన ఇళ్లను కేంద్ర కరువు బృందానికి మంగళవారం చూపిస్తున్న దృశ్యం. కేంద్ర కరువు బృందం మంగళవారం గుంటూరు, విశాఖ తదితర జిల్లాల్లో పర్యటించింది.