బాబూ! అబద్ధాలు మానుకో. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది: కన్నా లక్ష్మీనారాయణ
ఢిల్లీ: రాయలసీమలో వెనకబడిన జిల్లాగా పేరొందిన కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ చెప్పారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన... తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సిగ్గు లజ్జ వదిలేసి టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు కన్నా.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించమని రాష్ట్ర అధికారులకు ఆదేశాలిస్తే... అందుకు సమాధానంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. అమిత్ షా వ్యక్తిగతంగా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని తెలిపిన కన్నా... వెనకబడిన కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ అవసరం ఉందని మోడీని ఒప్పించారని స్పష్టం చేశారు. మరొకసారి పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారని కన్నా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ రెండు కలిపి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాల నివేదిక త్వరగా అందజేస్తే కేంద్రం ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్డర్ను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడా కూడా ప్లాంట్ సాధ్యపడదని చెప్పలేదని కన్నా వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్న కన్నా... తెలుగుదేశం నేతలు చేస్తున్న డ్రామాలు ఇకనైనా మానేయాలని హితవు పలికారు. సిగ్గు విడిచి నిర్లజ్జగా టీడీపీ ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మోసపూరిత చర్యలతో ప్రజలముందు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తోందని... ఇకనైనా కళ్లు తెరవాలని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.