ఏపీలో దాడులపై బీజేపీ ఎంపీలకు కేంద్రం క్లారిటీ.. జగన్ ధైర్యం కూడా అదేనా?
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా అధికార వైసీపీ తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బీజేపీ-జనసేన కూటమి నేతలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఎంపీలు రాసిన లేఖను హోంశాఖకు పంపుతూనే ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని వారికి తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్ కూ ఊరట లభించినట్లయింది.
స్ధానిక పోరులో హింసపై ఎంపీల లేఖ..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఏపీకి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిన్న లేఖ రాశారు. ఇందులో బీజేపీ-జనసేన అభ్యర్ధులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు ఎలా దాడులకు పాల్పడుతున్నారో వారు వివరించారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుంటే తప్ప ఎన్నికలు సజావుగా జరిగే పరిస్ధితి లేదని బీజేపీ ఎంపీలు అమిత్ షాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. దీంతో ఈ లేఖను అమిత్ షా హోంమంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీలో తాజా పరిస్ధితిపైనా నిఘా వర్గాలతో ఆరా తీసినట్లు సమాచారం.
పరిస్ధితి అదుపు తప్పితే..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా జరుగుతున్న దాడుల్లో ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు విపక్ష టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాయలసీమలోని పుంగనూరులో మాత్రమే బీజేపీ అభ్యర్ధులపై దాడులు జరిగాయి. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు దర్యాప్తు కూడా జరుపుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అలోచనలో లేనట్లు కేంద్రంతమ ఎంపీలకు సంకేతాలు ఇచ్చింది. ఏపీలో పరిస్ధితి అదుపు తప్పితే అప్పుడు చూద్దామని తనకు లేఖ రాసిన బీజేపీ ఎంపీలకు అమిత్ షా స్పష్టం చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం స్పందన వెనుక...
ఏపీలో స్ధానిక పోరులో హింసపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోకపోవడానికి వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. కేంద్రంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ సంబంధాలు, తాజాగా బీజేపీ పెద్దలు సూచించిన నత్వానీకి రాజ్యసభ సీటు కేటాయించడం, వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్నా అది బీజేపీ-జనసేనకు లాభించే పరిస్దితి లేకపోగా, చివరికి టీడీపీకి మేలు చేస్తుందనే భావన కారణంగా కనిపిస్తోంది. అందుకే పరిస్ధితిని నిశితంగా గమనిస్తున్నట్లు మాత్రమే కేంద్రం హోంశాఖ ఏపీ బీజేపీ ఎంపీలకు స్పష్టం చేసినట్లు అర్ధమవుతోంది
కేంద్రం నిర్ణయంతో జగన్ ఖుష్..
ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఏపీ బీజేపీ నేతలు రాసిన లేఖను కేంద్రం లైట్ తీసుకోవడం సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలకూ బిగ్ రిలీఫ్ గా మారింది. ఇప్పటికే ఏపీ స్ధానిక పోరులో చోటుచేసుకుంటున్న దాడులపై టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టుల వంటి విపక్షాలతో పాటు హైకోర్టు కూడా సీరియస్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు జగన్ కు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అలాగని దాడులు కొనసాగించమని కాదని, పరిస్ధితికి తగినట్లుగా వ్యవహరించమనేది కేంద్ర వర్గాల సమాచారంగా తెలుస్తోంది.