అన్నీ ఇచ్చేశాం, అవి కుదరదు: విభజన చట్టంపై సుప్రీంలో కేంద్రం, టీడీపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలు పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పిటిషన్ వేశారు. దీనిపై కేంద్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.
Recommended Video
కేంద్రం 34 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. పలు సందర్భాల్లో చేసిన కొన్ని ప్రకటనలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ అఫిడవిట్ సమర్పించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రైల్వే జోన్ ప్రస్తావనను తీసుకు రాలేదు.
రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉందని తేల్చి చెప్పింది. ఏపీకి విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చామని, ఇక ఏమీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూ లోటు కేవలం రూ.4,116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకు రూ. 3,979 కోట్లు ఇచ్చామని సుప్రీం కోర్టుకు తెలిపింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చామని, యూసీలు సమర్పించిన తర్వాత మరో మూడు సంవత్సరాలలో ఏడాదికి రూ. 330 కోట్ల వంతున చెల్లిస్తామని తెలిపింది.
చంద్రబాబు సమీక్ష
కేంద్రం అఫిడవిట్ పైన చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం అఫిడవిట్ తప్పుదోవ పట్టించేలా ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
నిర్లక్ష్యపు సమాధానం: కాల్వ
సుప్రీం కోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్లో అన్నీ అసత్యాలేనని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానానికి ఇంత నిర్లక్ష్యపు సమాధానమా అని ప్రశ్నించారు. వరద కాలువల నిధులను కూడా రాజధానికి ఇచ్చామని చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై కప్పదాటు వైఖరి అఫిడవిట్లో కనిపించిందన్నారు.
రెవెన్యూ లోటుపై కేంద్రం మాట మార్చిందని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. కేంద్రం తీరుపై వైసీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ లోటు విషయమై కేంద్రం మాట మార్చిందన్నారు. కేంద్రం తీరుపై వైసీపీ, జనసేనలు ఏం చెబుతాయని నిలదీసారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పడం విడ్డూరమన్నారు. కేంద్రం అఫిడవిట్లో అన్ని అబద్దాలేనని మంత్రి నారాయణ అన్నారు.