జగన్కు కేంద్రం గుడ్ న్యూస్- హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఏపీ...
కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నా ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఇప్పటివరకూ నికరంగా చేసిన ప్రయోజనం ఏమీ లేదు. సీఎం జగన్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను, ప్రధాని మోడీని కలిసినా ఇప్పటివరకూ కీలకమైన ప్రాజెక్టులేవీ ఏపీ తలుపు తట్టలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటులో భాగంగా రూపుదిద్దుకునే హైదారాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఏపీకి చోటు కల్పించింది. ఏపీ మీదుగా వెళ్లే ఈ కారిడార్లో ఏపీలోని ప్రాంతాలకు కూడా సముచిత స్ధానం కల్పించింది.
Recommended Video
హైదరాబాద్-బెంగళూరు కారిడార్...
కేంద్రం తాజాగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ద్వారా దేశవ్యాపంగా పలు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీ, కర్నాటక మూడు రాష్ట్రాలకు ప్రయోజనం ఉండేలా రూపుదిద్దుకోనున్న ఈ కారిడార్ ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ కారిడార్ ఏర్పాటుతో దక్షిణాదిన పారిశ్రామిక అభివృద్ధిలో మూడు రాష్ట్రాలను భాగస్వాముల్ని చేసినట్లు అవుతుందని కేంద్రం చెబుతోంది. ఈ కారిడార్లో భాగంగా పలు కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు త్వరలోనే మొదలు కానున్నాయి.
జగన్కు గుడ్ న్యూస్ ఇలా...
విభజన కారణంగా కష్టాల్లో ఉన్న ఏపీకి కొత్త పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటులో భాగస్వామి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేకంగా కారిడార్లు కేటాయించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో కేంద్రం తాజాగా ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏపీకి కూడా ప్రయోజనం కల్పించేలా కేంద్రం రూట్మ్యాప్ సిద్ధం చేసింది. దీంతో పాటు విశాఖ-చెన్నై కారిడార్లోనూ ఏపీకి ప్రయోజనం కల్పించేలా చేస్తామని కేంద్రం నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కారిడార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు.
ఏపీలో పారిశ్రామిక నోడ్లు ఇవే...
కేంద్రం కొత్తగా ఆమోదించిన ప్రణాళిక ప్రకారం హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, కడప జిల్లాలో కొప్పర్తిని నోడ్లుగా ఎంపిక చేశారు. అలాగే విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్లో నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిత్తూరు జిల్లాలోని రౌతుసురుమల పారిశ్రామిక నోడ్లుగా ఎంపిక చేశారు. వీటి ద్వారా ఈ రెండు కారిడార్లలో పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకోనుంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. తాజా కారిడార్తో ఏపీలో పారిశ్రామిక కారిడార్ల సంఖ్య మూడుకు చేరింది. విశాఖ-చెన్నె, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం అభివృద్ధి చేయబోతోంది.
తిరుపతిలో ఐటీ పార్కుకు రెడీ...
రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన అందింది. తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చింది. ఈ మేరకు వాక్ టూ నెక్స్ట్ కాన్సెప్ట్తో తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చినట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి ప్రకటించారు. ఐ.టీ పార్కు ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని కపిల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అందుకు భూ కేటాయింపులలో సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఐటీ పార్కు ఏర్పాటుకు 25 ఎకరాల భూమి, ఇతర వనరులు సమకూరిస్తే సుమారు 6 నుంచి 8 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించి తమ నిర్ణయం చెబుతామని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు.