విజయవాడకు కొత్త బైపాస్-భీమిలి టూ భోగాపురం గ్రీన్ఫీల్డ్ కారిడార్- కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో రెండు కీలక రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంతే కాదు వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా భరించేందుకు ముందుకొచ్చింది. స్ధానిక పన్నుల రాయితీ, ఇతర సహకారం అందించాలని రాష్ట్రాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది. త్వరలో పట్టాలెక్కబోయే ఈ రెండు ప్రాజెక్టులు భవిష్యత్ రాజధానులుగా మారబోతున్న విజయవాడ, విశాఖ నగరాలకు మణికిరీటాలు కానున్నాయి. వీటి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకూ చెక్ పడబోతోంది.
ఏపీలో రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం సై
ఏపీలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు కీలక రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర ఉపరితల రవాణామంత్విత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బృందం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వారికి హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి విజయవాడ తూర్పు బైపాస్ కాగా మరొకటి విశాఖపట్నంలోని భీమిలి నుంచి విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టును కలిపే గ్రీన్ఫీల్డ్ కారిడార్. ఈ రెండు ప్రాజెక్టులకు వందశాతం ఖర్చు కేంద్రమే భరించనుండడం ఇక్కడ మరో విశేషం.
భీమిలి-భోగాపురం గ్రీన్ఫీల్డ్ కారిడార్..
విశాఖ నగరాన్ని ఏపీ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకుంది. త్వరలో అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో విశాఖ నగరంపై మరింత ఒత్తిడి పెరగబోతోంది. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్యలతో పాటు కొత్తగా విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే నరకయాతన తప్పదు. దీంతో ఇప్పటికే విశాఖ పోర్టు నుంచి భీమిలి వరకూ ఉన్న రోడ్డును విస్తరించడమే కాకుండా కొత్తగా భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు కలిపేలా గ్రీన్ఫీల్డ్ కారిడార్ను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
విజయవాడకు మరో బైపాస్
ఏపీలో వాణిజ్య రాజధానిగా పేరున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల అభివృద్ధి మాత్రం జరగడం లేదు. దీంతో జనం నిత్యం నరకయాతన చూస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి నుంచి విజయవాడ దాటి వెళ్లాల్సిన వాహనాలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించినా దాని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. కాబట్టి మరో కొత్త బైపాస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ప్లాజా నుంచి గుంటూరులోని కాజా టోల్ ప్లాజా వరకూ కృష్ణానదిని ఆనుకుని ఈ కొత్త బైపాస్కు రూపకల్పన చేశారు. విజయవాడ తూర్పు బైపాస్గా పిలుస్తున్న దీని నిర్మాణం పూర్తయితే నగరాన్ని దాటి వెళ్లే భారీ వాహనాలకు సమస్యలు తీరుతాయి.
బంపర్ ఆఫర్- ఖర్చంతా కేంద్రానిదే
ఈ రెండు ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో రైల్వే ట్రాక్లపై నిర్మిస్తున్న మరో 20 ఆర్వోబీలకు రాష్ట్ర వాటా బదులు కేంద్రమే డబ్బులు చెల్లించేలా గడ్కరీ మరో వరం ప్రకటించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రతిపాదిస్తున్న ఎక్స్ప్రెస్వే కోసం నాలుగైదు రూట్లపై చర్చ సాగుతోంది. ఇందులో ఏదో ఒకటి ఫైనల్ చేసి ఇస్తామని గడ్కరీ రాష్ట్రానికి హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణలోని నాగార్జున సాగర్ నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరి పేట వరకూ ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు సాగితే త్వరలో రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.