ఏపీకి పోలవరం బాకీ రూ.3805 కోట్లు- త్వరలో ఇచ్చేస్తామన్న కేంద్రం....
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని కేంద్రం అన్ని లెక్కలు పరిశీలించాక తిరిగి చెల్లిస్తోంది. కానీ ఈ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల కాకపోవడంతో పనులపై ప్రభావం పడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిన వైసీపీ ఎంపీలు.. తాజాగా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
200 లంక గ్రామాలు మునక: జగన్ సర్కార్ ఏం చేస్తోంది?: బ్యాడ్లక్: పోలవరం పూర్తయి ఉంటే: పవన్
పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.
అంతకుముందు రాజ్యసభలో పోలవరంపై మాట్లాడిన సాయిరెడ్డి... తాజాగా సీఎం జగన్ ప్రధాని మోడీ పోలవరం బకాయిల విడుదలపై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు.