మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా-వైసీపీ నేత షాకింగ్-కేంద్రం వెనకడుగు-అడగాలంటే బాబుకు భయం
ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన కీలక హామీ ప్రత్యేక హోదాపై ఇప్పటివరకూ కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతటితో ఆగకుండా ఇది ముగిసిన అధ్యాయమంటూ పదే పదే తేల్చిచెప్పేసింది. అయినా ఇంకా ఏపీలో ప్రత్యేక హోదా చర్చ మాత్రం ఆగడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదాపై అధికార పార్టీని టార్గెట్ చేయడమే కాకుండా 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేక హోదా తెస్తామంటూ వైసీపీ హామీ ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. దీంతో విపక్ష టీడీపీ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెడుతున్నారు.
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా
రెండేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికార వైసీపీలో అసహనం పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేకపోతోందంటూ విపక్ష టీడీపీ నేతలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నుంచి కూడా ఎదురుదాడి మొదలైనట్లే కనిపిస్తోంది. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ కీలక నేత, అసెంబ్లీ ఛీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే ప్రత్యేక హోదాపై పోరులో విపక్షాల కంటే తామే ముందుండాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హోదాపై కేంద్రం వెనుకడుగన్న శ్రీకాంత్రెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నటీడీపీపై భారీగా ఒత్తిడి పెంచిన వైసీపీ ఇప్పుడు తాము అధికారంలో ఉన్నా అదే వైఖరి కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ ఛీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం వెనుకడుగు వేస్తోందన్నారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో హోదాపై తమ నేత జగన్ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదనే అసహనంతో శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్దమవుతోంది.
మోడీని విమర్శించాలంటే బాబుకు భయం
అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీని విమర్శించాలంటే భయమని ఛీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే టీడీపీ నుంచి ప్రత్యేక హోదా సాధన విషయంలో వైసీపీపై, పార్టీ అధినేత కమ్ సీఎం జగన్పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబును శ్రీకాంత్రెడ్డి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అదీ కాక బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రత్యేకహోదాపై ఒత్తిడి పెంచడం ద్వారా ఆ ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పెట్టాలనే ఆలోచనతోనే శ్రీకాంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది.
హైకోర్టు తరలింపుకు టీడీపీ అడ్డు
ప్రత్యేక హోదాతో పాటు హైకోర్టు తరలింపు విషయంలోనూ టీడీపీ వైఖరిపై శ్రీకాంత్రెడ్డి విమర్శలు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే రాజధానుల తరలింపు చేపట్టినట్లు శ్రీకాంత్రెడ్డి వివరించారు. కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు, హైకోర్టు తరలింపుకుటీడీపీ అడ్డుపడుతోందన్నారు. త్వరలో రాజధాని తరలింపు ఖాయమని శ్రీకాంత్ తెలిపారు. అటు విశాఖకు రాజధాని తరలింపుపై ఉత్తరాంధ్ర మంత్రులు నిత్యం లీకులు ఇస్తున్న నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై శ్రీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.