వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: నిబంధనలు పాటించని ఎన్జీవోలను కేంద్రం నిషేధం విధించింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించడంతో తెలంగాణకు చెందిన 90, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 168 ఎన్జీవోలపై మోడీ సర్కారు నిషేధం విధించింది. కాగా, నిషేధానికి గురైన ఎన్జీవోల జాబితాలో వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ కూడా ఉండటం గమనార్హం.
సేవా భారతితోపాటు..
ఫారెన్ కంట్రబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) 2010 కింద రిజిస్టరై.. హైదరాబాద్, సికింద్రాబాద్లో నడుస్తోన్న చర్చిలు, విద్యా సంస్థలను కూడా రద్దు చేసింది. ఈ జాబితాలో సేవా భారతి, హైదరాబాద్ ఆర్క్డియోసీజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్యహరిశ్చంద్రఫౌండేషన్ కూడా ఉన్నాయి.
వైఎస్ విజయమ్మ ట్రస్ట్.. రాయపాటి..
ఏపీలో రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ సొసైటీ, రాయపాటి చారిటబుల్ అసోసియేషన్, వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్, ఫిలడెల్ఫియా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి తదితర ఎన్జీవోల రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది.
నివేదికలు అందించడంలో విఫలం
విదేశాల నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి? వాటిని ఎలా ఖర్చు చేశారనే అంశంపై వార్షిక నివేదికలను కేంద్రానికి సమర్పించడంలో విఫలమైనందున ఆయా ఎన్జీవో సంస్థలపై కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
చట్టం ప్రకారం..
విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 ప్రకారం.. నివేదికలను సమర్పించాల్సి ఉన్నా.. 2017-18 సంవత్సరానికి నివేదికలు సమర్పించడంలో నిషేధానికి గురైన సంస్థలు విఫలమయ్యాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. 2019, మార్చి 31 వరకు గడువు పొడిగించినా కూడా వార్షిక నివేదికలు సమర్పించలేదని, వార్షిక నివేదికలు సమర్పించకపోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. చివరి సారిగా జూన్ 22న నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లో ఆదాయ వ్యయ నివేదికలు సమర్పించాలని కోరినా.. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించింది.