పోలవరం నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ ! నో డీబీటీ.. ఓన్లీ రీయింబర్స్ మెంట్ !
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులు అవుతున్న వారికి ప్రత్యక్ష నగదు బదిలీ చేయబోమని కేంద్రం ఇవాళ తేల్చిచెప్పేసింది.
ఏపీలో విభజన హామీల్లో భాగంగా నిర్మిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రం ఇవాళ బ్యాడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ఖర్చును రీయింబర్స్ మెంట్ ద్వారా చెల్లిస్తున్న కేంద్రం.. నిర్వాసితులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పరిహారం చెల్లించాలని ఏపీ కోరుతోంది. ఈ మేరకు ఇవాళ పార్లమెంటులో వైసీపీ కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. పోలవరం నిర్వాసితులకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసే ఆలోచన లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్న నేపథ్యంలో నిర్వాసితులకు కేంద్రం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పరిహారం చెల్లింపు కుదరదని జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి కేంద్రం గతంలో ఆమోదించిన ఒప్పందం మేరకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ సర్కార్ చేస్తున్న ఖర్చును కూడా ఎప్పటికప్పుడు రీయింబర్స్ మెంట్ ద్వారా చెల్లిస్తున్నట్లు షెకావత్ వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు ఖర్చును ఎప్పటికప్పుడు చెల్లించడం లేదన్న విమర్శల్ని కేంద్రమంత్రి కొట్టిపారేశారు. భూసేకరణ, పునరావాసం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇప్పటివరకూ తమ వద్ద పెండింగ్ లో లేదన్నారు. ఈ మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు, వాటికి చేసిన చెల్లింపుల వివరాల్ని లోక్ సభలో గజేంద్ర షెకావత్ వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్వాసితులపై పెడుతున్న ఖర్చును సైతం రీయింబర్స్ మెంట్ ద్వారా తీసుకోవాలని కేంద్రం సూచించినట్లయింది.