జగన్, కేసీఆర్ కు కేంద్రం లేఖలు- ప్రాజెక్టులపై సమన్వయం లోపించిందని అక్షింతలు
ఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్నింటిని ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోగా.. అంతకు మించి కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తన్న చాలా ప్రాజెక్టులపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ట్రైబ్యునల్స్ తో పాటు రివర్ బోర్డులు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ చర్చించి పరిష్కారాలు చూపుతున్నా ఇంకా వీటిపై రచ్చ కొనసాగుతూనే ఉంది.
అయితే తాజాగా కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీలో తేల్చాలని కేంద్రం ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అయితే ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ అనుమతి లేకుండా ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దంటూ కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ సీఎంలు కేసీఆర్, జగన్కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కరువైందని ఆయన ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్కు రాసిన లేఖల్లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం కోసం ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాసిన నేపథ్యంలో కేంద్రమంత్రి షెకావత్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.