అందుకే దుగరాజుపట్నం పోర్ట్ సాధ్యం కాదు, కానీ: చంద్రబాబు కోర్టులోకి కేంద్రం
న్యూఢిల్లీ: ఏపీలోని దుగరాజుపట్నం వద్ద పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తేల్చి చెప్పింది. ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, రవీంద్ర కుమార్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావులు పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
దుగరాజుపట్నం పోర్ట్ సాధ్యపడదని నీతి అయోగ్ చెప్పిందని, దాని సమీపంలో కృష్ణపట్నం, చెన్నై తదితర పోర్టులు ఉన్నాయని తెలిపింది. దుగరాజుపట్నం వద్ద పోర్టుకు బదులు మరోచోట ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. అందుకు తగినస్థలం చూపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఎక్కడ చూపుతుందోనని వేచి చూస్తున్నామని కేంద్రం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2014 మార్చి 31 నాటికి ఖర్చు, ఆడిట్, ప్రతిపాదనల వివరాలు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలపై కేంద్రం స్పందిస్తూ... ప్రస్తుతం కేసు కృష్ణా ట్రైబ్యునల్లో కొనసాగుతోందని తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేస్తుందన్నారు.