ఏపీలో ఏం జరుగుతోంది..కేంద్రం ఆరా: ఈ ఘర్షణకు కారణమేంటి: లోక్ సభలో వైసీపీ వాయిదా తీర్మానం..!
ఏపీలో జరుగుతున్న పరిణామాలపైన కేంద్ర ఆరా తీస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పైన ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేయటం..ఆ తరువాత సీఎం నేరుగా ఎన్నికల కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయటం..మంత్రుల విమర్శలు..ప్రతిపక్షాల ఆరోపణల పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ సైతం ప్రాధమికంగా ఏపీలో ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నట్లుగా మారిన వివాదం పైన నివేదిక పంపినట్లుగా సమాచారం. దీంతో..పాటు రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్ర నిఘా సంస్థల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో..ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని నిరసిస్తూ లోక్ సభలో సోమవారం నిలబడి నిరసన వ్యక్తం చేసిన వైసీపీ ఈ రోజు వాయిదా తీర్మానం..ఇచ్చి చర్యలకు డిమాండ్ చేయనుంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారుతోంది.
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం.. కేంద్రం ఆరా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి కారణమైంది. దీని పైన ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పైన ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పిలిపించి దీని పైన వివరణ కోరారు. ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం వివాదం పైన గవర్నర్ ఇప్పటికే కేంద్రానికి ప్రాధమిక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర పరిస్థితిపై బీజేపీ కేంద్రానికి నివేదిక
కేంద్రం సైతం అసలు ఎన్నికలు వాయిదా ఎందుకు పడ్డాయి. చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత. రాజకీయంగా ఏమైనా ప్రభావం ఉందా...అనే కోణంలో కేంద్ర నిఘా సంస్థల ద్వారా ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతల నుండి కేంద్రానికి ఈ వ్యవహారం పైన సమాచారం అందింది. దీని పైన పార్లమెంట్ లో వైసీపీ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కేంద్రం సైతం పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీని పైన అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అటు సుప్రీం కోర్టు..ఇటు హైకోర్టులోనే ఏపీ ప్రభుత్వం పిటీషన్లు దాఖలు చేసింది.
Recommended Video
పార్లమెంట్ లో నేడు వాయిదా తీర్మానం..!
ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్ర పూరితంగా జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ దీని పైన లోక్ సభలో ప్రస్తావించేందుకు సిద్దమైంది. సోమవారం ఇదే అంశం పైన లోక్ సభలో వైసీపీ సభ్యులు తమ బెంచ్ ల్లోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ రోజు దీని పైన వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. వైసీపీ సభ్యుడు బాలశౌరి ఈ తీర్మానం ప్రతిపాదించారు. ప్రభుత్వంతో కరోనా పైనా ఎటువంటి సమీక్ష చేయకుండా.. మీడియా సమక్షంలోనే ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ పైన సంతకాలు చేయటం వంటి అంశాలను సభలో ప్రస్తావించి..ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేయనుంది. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం పైన కేంద్రం పూర్తిగా ఫోకస్ పెట్టింది. దీంతో..కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా అంశం పైన ఏరకంగా స్పందిస్తుదనేది ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా వాయిదా వేయటంతో...కేంద్రం నుండి రావాల్సిన నిధుల పైన సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది.