ఏం జరుగుతోంది: తెలుగు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్పై కేంద్రం ఆరా
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం నాడు రెండు ఎన్కౌంటర్ల పైన కేంద్రం ప్రభుత్వం ఆరా తీసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ నేతృత్వంలో అధికారుల సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా చర్చించారు. నివేదికలివ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో ఇద్దరి పోలీసులను ఉగ్రవాదులు హత్య చేయడం, ఆ తర్వాత జానకీపురంలో సిమి ఉగ్రవాదులను కాల్చి చంపడంతో తెలంగాణ వణికింది. నల్గొండ, వరంగల్ జిల్లాలు సిమి ఉగ్రవాదుల భయంతో వణికిపోతున్నాయి.
అంతలోనే, మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగర్ల ఎన్ కౌంటర్ జరిగింది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఉదయం 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు మట్టుబెట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే 500 వందల మంది కూలీలను ఎర్ర చందనం స్మగర్లు దించినట్లుగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా కాల్పులతో మరోసారి హోరెత్తింది. ఉగ్రవాది వికారుద్దీన్ సహా ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఆలేరు - జనగామ రహదారిలో వీరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.