ఎపి ప్రభుత్వానికి కేంద్రం షాక్: మెట్రోపై శ్రీధరన్తో బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. హుధుద్ తుఫాను నష్టం చంద్రబాబు ప్రభుత్వం చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నష్టం సుమారు రూ.680 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని తేల్చింది. తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది.
ఈ విషయమై మాట్లాడేందుకు ఈ నెల 15న ఢిల్లీ రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కబురు పెట్టింది. హుధుద్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 21,908 కోట్లు ఆర్ధిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.
విశాఖలో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ వెయ్యి కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటివరకూ రూ.400 కోట్లు విడుదల చేశారు. కాగా, హుధుద్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థిక వనరులపై శ్రీధరన్తో చంద్రబాబు చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోలపై సాధ్యాసాధ్యాల నివేదికను మార్చిలోగా ఇవ్వాలని చంద్రబాబు శ్రీధరన్ను కోరారు. వచ్చే జూన్ నాటికి రెండు మెట్రో రైళ్ల పనులు ప్రారంభం కావాలని, 2018 నాటికి పూర్తి చేయాలని ఆయన సూచించారు.