అవిశ్వాసంతో కేంద్రం భయపడుతోంది: ఏపీ సమస్యలపై సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: అవిశ్వాసంపై చర్చించేందుకు కేంద్రం భయపడుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. శుక్రవారం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. పొలిట్బ్యూరో రూపొందించిన పార్టీ సంస్థాగత ముసాయిదా నివేదికపై చర్చించారు.
నివేదికను అఖిల భారత మహాసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్లో అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు.
'రెండు వారాలుగా టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకురావడంలో కేంద్రం విఫలమైంది' అని సీతారాం ఆరోపించారు.
అంతేగాక, తప్పించుకునే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందని, అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోందని ఆయన అన్నారు. మిగతా పార్టీలతో పాటు తాము కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నామని చెప్పారు.
చర్చ జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా, హామీ సహా బీజేపీ వైఫల్యాలపై చర్చిస్తామని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్పై సమావేశాల్లో చర్చించలేదని, ఎన్నికల సమయంలో చర్చిస్తామని సీతారం ఏచూరి వెల్లడించారు.