గడువేమీ లేదు: ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్, ‘ఏపీనే ముందుకు రావాలి’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఎటువంటి తుదిగడువు లేదని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పొందుపరిచిన విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించింది.
ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో గురువారం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు కలిపి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఏపీ సర్కార్ చొరవ తీసుకుంటే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందనే సంకేతాలు పంపింది. భవనాలు, మౌలిక వసతులను ఏపీ సర్కార్ కల్పిస్తే కేంద్రం ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ను జారీ చేస్తుందని తెలిపింది.
అయితే, కేంద్రం అఫిడవిట్ నేపథ్యంలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విభజన చట్టం హామీల అమలుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది.