ఏపీ, తెలంగాణకు మొండిచేయి: తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజనపై కేంద్రం క్లారిటీ
నాలుగు ఈశాన్య రాష్టాలతో పాటు జమ్ము, కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్ ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
పునర్విభజన అత్యవసమైన చోటే
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా కల్లోల ప్రాంతాలైన జమ్ము, కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లలో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనట్లే.
పునర్విభజన కమిషన్ లో ఎవరెవరు
సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఛైర్ పర్సన్ గా ముగ్గురు సభ్యుల కమిషన్ ను కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. దేశాయ్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన స్ధానిక ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఈ కమిషన్ లలో ఉంటారు. 2002 నాటి నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఈ కమిషన్లు పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిషన్లకు ఏడాది పదవీకాలం ఇచ్చింది. ఏడాది లోపు ఆయా కమిషన్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా పునర్విభజన ప్రక్రియను అమలు చేస్తారు.
పునర్విభజన అక్కడే ఎందుకు ?
నాలుగు రాష్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలల్లోనే పునర్విభజన చేపట్టేందుకు వీలుగా కేంద్ర న్యాయశాఖ కమిషన్లు ఏర్పాటు చేయడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గమనిస్తే జమ్ము, కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. ఇప్పటికీ అక్కడ ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. అలాగే ఎన్సార్సీ అమలు నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఎన్సార్సీ వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్న నాలుగు ఈశాన్య రాష్ట్రాలు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అక్కడ నియోజకవర్గాల పునర్విభజనను త్వరగా పూర్తి చేసి పరిస్ధితిని చక్కదిద్దాలనేది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.
Recommended Video
ఏపీ, తెలంగాణకు మొండిచేయి
నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని గడువు కన్నా ముందే నియోజకవర్గాల పునర్విభజనకు మొగ్గు చూపిన కేంద్రం... ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణ నుంచి వినిపిస్తున్న డిమాండ్ల విషయంలో మాత్రం కనికరించలేదు. ఆయా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రత్యేక పరిస్ధితులు లేకపోవడం, రాజకీయ కారణాలతోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పునర్విభజన కోరుతున్నారన్న అంచనాలతోనే కేంద్రం ఏపీ, తెలంగాణలో పునర్విభజనను పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పలుమార్లు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడం వెనుక ఇవే కారణాలుగా అర్దమవుతోంది.