ఆరోగ్యసేతు యాప్ వాడాల్సిందే.. ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల భద్రతతో పాటు కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఆరోగ్యసేతు యాప్ ను విస్తృతంగా ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ యాప్ ను తమ సెల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా ప్రతీ రోజూ విధుల్లోకి వచ్చేముందు తప్పనిసరిగా పరీక్షించుకోవాలని కేంద్రం సూచించింది.
ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉద్యోగి తన తాజా వివరాలు నమోదు చేశాక యాప్ లో సురక్షితమని సూచిస్తేనే విధులకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవాలి. యాప్ వాడుతున్నప్పుడు తమ ఇళ్లకు సమీపంలో ఎవరైనా కరోనా రోగులు ఉంటే యాప్ లో వాటి వివరాలు ప్రత్యక్షమవుతాయి. వీటి ఆధారంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే తాము కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం దీన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సేతు యాప్ ను ఉద్యోగులకు తప్పనిసరి చేశాయి.