మోడీ విశాఖ పర్యటనకు ముందే ఏపీకి పెద్ద శుభవార్త!: రైల్వే జోన్ ఇచ్చినా.. ఆప్షన్స్ చూస్తున్న బాబు
విశాఖపట్నం: త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 1వ తేదీన ఆయన విశాఖపట్నానికి రానున్నారు. 2014లో విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి పలు హామీలు ఇచ్చింది. ఆ హామీలను ఒక్కటొక్కటి మోడీ ప్రభుత్వం నెరవేర్చుతోంది. హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నప్పటికీ ఈ అయిదేళ్లలోనే ఎన్నో పనులు చేశామని బీజేపీ చెబుతోంది. అయితే ప్రత్యేక హోదా అంశం ఏపీలో కీలకంగా మారింది. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికి దానికి మించి నిధులు ఇచ్చామని కేంద్రం చెప్పింది.
మోడీ పర్యటనకు ముందే ఏపీకి శుభవార్త
తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు ముందు కేంద్రం ఏపీకి మరో శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఇటీవల గుంటూరులో పర్యటించిన ప్రధాని అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇప్పుడు మరో శుభవార్త వెలువడనుందని తెలుస్తోంది. అయితే మోడీ పర్యటనకు ముందే ఆ శుభవార్త ఉంటుందా లేక తన విశాఖ సభలోనే మోడీ ప్రకటన చేస్తారా తెలియాల్సి ఉంది.
విష్ణు కుమార్ రాజు ఏం చెప్పారంటే
ఈ సందర్భంగా బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆదివారం మాట్లాడారు. తాము (బీజేపీ నేతలు) రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిశామని చెప్పారు. ఏపీలో ప్రధాని మోడీ సభ కంటే ముందే రైల్వే జోన్ పైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. రైల్వే జోన్ ఇచ్చేది తామే, తెచ్చేది తామే అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేంద్రం రైల్వే జోన్ ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మోడీని నిలదీసేందుకు దారులు వెతుకుతున్న టీడీపీ
ఈ నేపథ్యంలో మోడీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ఆప్షన్స్ వెతుక్కుంటోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి గంటాలు ఆ దిశగా హింట్ ఇచ్చారు. మోడీ విశాఖ సభలో రైల్వే జోన్ గురించి ఆందోళనలు ఉంటాయని భావించారు. కానీ రైల్వే జోన్ ప్రకటిస్తే కనుక ఇతర అంశాలపై దృష్టి సారించాలని, వాటిపై నిలదీయాలని చంద్రబాబు సూచనలు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ ఏం చేశారో చెప్పాలని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. విశాఖకు మెట్రో రైల్ ఎందుకు ఇవ్వలేదో అడగాలన్నారు. రూ.350 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకు వెళ్లారో నిలదీయాలన్నారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏం చేశారో అడగాలన్నారు. హుధుద్ తుఫానుకు రూ.1000 కోట్లు ఏవో అడగాలన్నారు.
రైల్వే జోన్ ఇచ్చినా నిరసనలు
ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో నిరసన సెగలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. ప్రధాని విశాఖ సభలో రైల్వే జోన్ ప్రకటించినా నిరసనలు తప్పవని చెప్పారు. ప్రధాని పేరు ఉచ్చరించడానికే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ జోస్యం ఫలించదని, మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని చెప్పారు.