మోడి చేతిలోనే: టిఎస్సార్, 'హోదా దిశగా కేంద్రం అడుగు!', అండమాన్లో రాజప్ప ప్రచారం
విజయవాడ/విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఎంపీ సుబ్బిరామి రెడ్డి శుక్రవారం నాడు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా తీసుకు రావడంలో అందరికంటే ఎక్కువ బాధ్య టిడిపిదే అన్నారు. ప్రధాని మోడీ చేతిలోనే ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు. కాగా, సుబ్బిరామి రెడ్డి విశాఖలోని ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
ప్రత్యేక హోదా వస్తుంది: బొండా ఉమ
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోందన్నారు.
శుక్రవారం ఉదయం ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని.. ప్రత్యేక హోదా పైన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన నీతి ఆయోగ్ భేటీనే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ఉన్న అడ్డంకులపై నీతి ఆయోగ్ సమావేశం చర్చించిందన్నారు.
అండమాన్ తెలుగు ప్రజలకు అండగా టిడిపి: చినరాజప్ప
అండమాన్లోని తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయల చినరాజప్ప చెప్పారు.
అండమాన్ నికోబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి తరఫున ఆయన ప్రచారం చేశారు. జాతీయ పార్టీగా అవతరించనున్న నేపథ్యంలో టిడిపికి అండమాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో నాంది పలుకుతామన్నారు.