సీఎం కేసీఆర్ అనుమతిస్తారా?: గోదావరి, కృష్ణా ఇంటర్లింక్కు కేంద్రం కొత్త ప్లాన్ ఇలా
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై కొత్త ప్రతిపాదన తెర ముందుకొచ్చింది. గోదావరి నది నుంచి కావేరి వరకు నదులను అనుసంధానించడానికి జాతీయ జల వనరుల అభివ్రుద్ధి సంస్థ (ఎన్ డబ్ల్యూడీఏ) తెలంగాణను రహదారిగా ఎంచుకున్నది. ఒకవైపు గోదావరి, క్రుష్ణా నదుల అనుసంధానాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా.. ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపునకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం వద్ద అకినేపల్లి వద్ద నిర్మించిన బ్యారేజీ నుంచి 270 టీఎంసీల నీటిని 'లిఫ్టు' ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తరలించాలన్నది కేంద్రం అభిమతం. అక్కడ నుంచి నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్ మీదుగా తమిళనాడుకు తరలించాలన్నది లక్ష్యం.
గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీ నదికి తరలించాలని సూచించింది. దీనికి రూ.45,049 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిని సిద్ధం చేసింది. తద్వారా మూడు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చేలా కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. కేవలం మూడున్నరేళ్ల క్రితమే ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం గానీ, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గల ఒడిశా ప్రభుత్వం గానీ ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తారా? అన్నదే సందేహం.
మహా నది నుంచి గోదావరి మీదుగా కృష్ణా అనుసంధానం ఇలా
దక్షిణాదిలో నదుల అభివృద్ధి కోసం ద్వీపకల్ప నదుల పథకాన్ని కేంద్రం చేపట్టిన విషయం తెలిసిందే. అందు కోసం ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నాయని అంచనాలున్న దృష్ట్యా ఆ నీటిని కృష్ణా, కావేరి పరీవాహకాలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం.
ఈ ప్రతిపాదనను తప్పుబట్టిన ఒడిశా, తెలంగాణ
ఇందుకు తొలుత తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి) - నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దాదాపు ఏడాది పాటు మరుగున పడ్డ ఈ అంశం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఒడిశాలోని మణిభద్ర ప్రాజెక్టు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మించలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. ఇచ్చంపల్లికి 74 కిమీ దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీలు లభ్యతగా జలాలు ఉంటాయని అంచనా వేసింది. అందులో తెలంగాణ, ఏపీలు తమ ప్రాజెక్టులకు వినియోగించుకోగా 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని అంచనా వేసింది.
రోజుకు రెండు టీఎంసీల నీరు తరలించాలన్నది కేంద్రం ప్రతిపాదన
దీంతో అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్కు నీటిని తరలించేలా ప్రణాళిక వేసింది. ఈ కాలువ పెద్దవాగు, కిన్నెరసాని, మురేడు. పాలేరు, మూసీ నదులను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన తర్వాత గోదావరి నది నిండుగా ప్రవహిస్తుంది. ఇచ్చంపల్లికి 63 కిమీ దిగువన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలు మిగిలి పోగా, 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు (289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు 2 టీఎంసీలు) చొప్పున తరలించాలని ప్రతిపాదించింది.
సొరంగాలతో గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్కు నీరు
గోదావరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు 20 టీఎంసీలు) నిల్వ సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. దీనితో 12 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదు. అకినేపల్లి బ్యారేజీ నుంచి 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత కాలువ ద్వారా 4.3 కిలోమీటర్ల దూరం తరలిస్తారు. అక్కడి నుంచి తిరిగి 100.57 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. 324.2 కిలోమీటర్ల పొడవున కాలువ, 12.50 కిలోమీటర్ల సొరంగాల ద్వారా గ్రావిటీతో నాగార్జునసాగర్కు నీరు చేరుతుంది.
సోమశిలలో మరో రెగ్యులేటర్ ద్వారా నీటి తరలింపు
నాగార్జునసాగర్ కుడిగట్టు వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి 393.02 కిలోమీటర్ల పొడవైన కాలువల (1.265 కిలోమీటర్ల సొరంగం కలిపి) ద్వారా నీటిని సోమశిల (పెన్నా) రిజర్వాయర్కు తరలిస్తారు. సోమశిల రిజర్వాయర్ కుడిగట్టుపై రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి కండలేరు వరద కాలువకు సమాంతరంగా 529.19 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరీ నదిపై నిర్మించిన గ్రాండ్ ఆనకట్టకు జలాలను చేరుస్తారు. ఈ నదుల అనుసంధానం పూర్తి చేయడానికి రూ.45,049 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దీనిని రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. తొలిదశలో అకినేపల్లి-నాగార్జునసాగర్ వరకు.. రెండో దశలో నాగార్జునసాగర్-సోమశిల-కావేరీ గ్రాండ్ ఆనకట్ట వరకు పనులు చేస్తారు.
11.16 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా లక్ష్యం
నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరు అందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకంతో ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్డబ్ల్యూడీఏ అంచనా వేసింది.