వర్షంలో పవన్-మోడీ హామీ, విజయమ్మను ఓడించింది: విశాఖపై కేంద్రం బుజ్జగింపు
విశాఖ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తేలిపోయింది. హోదా బదులు దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. హోదా పైన విపక్షాలు, హోదా ఉద్యమ నాయకులు పోరాడేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా, హోదా అనంతరం రైల్వే జోన్ అంశం కూడా వేడి రాజేస్తోంది.
విశాఖకు రైల్వే జోన్ ఎంతో కాలం నుంచి ఉన్న డిమాండ్. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. విశాఖకు రైల్వే జోన్ను నాడు బిజెపి-టిడిపి-జనసేన కూటమి హామీ ఇచ్చింది. అయితే, తాజాగా విశాఖ బదులు విజయవాడకు రైల్వే జోన్ అంటూ కేంద్రం మెలిక పెట్టింది. అందుకు చత్తీస్గఢ్, ఒడిశా అభ్యంతరం చెప్పడమేనని అంటున్నారు.
అయితే, రైల్వే జోన్ విశాఖకే ఇవ్వాలని స్థానిక నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం నాడు విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై హామీ ఇచ్చారు. రైల్వే జోన్ విశాఖకే వస్తుందని, అన్యాయం చేయమని చెప్పారు.
2014 ఎన్నికల ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలోని బిజెపి, టిడిపి, జనసేన అధినేత పవన్ విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని బహిరంగ సభ వేదికగా హామీ ఇచ్చారు. ఆనాడు జోరుగా కురుస్తున్న వానలో కొనసాగిన సభలో మోడీ, చంద్రబాబు, పవనలు హామీ ఇచ్చారు.
ప్రధానంగా ఈ హామీతోనే విశాఖ ఎంపీగా బీజేపీ నేత హరిబాబు గెలిచారు. విశాఖలో హరిబాబు పైన వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేశారు. విజయమ్మ పైన హరిబాబు గెలుపు అసాధ్యమని అందరూ భావించారు. కానీ విశాఖకు జనసేన-టిడిపి-బిజెపి ఇచ్చిన హామీ... హరిబాబును గెలిపించి, విజయమ్మ ఓడిపోయేలా చేసిందని చెప్పవచ్చు.
కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా మనుగడ సాగించలేదని ఈ కమిటీ చెప్పింది. ఇదే సమయంలో ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాలు కూడా అభ్యంతరం చెప్పాయి. దీంతో ఎన్డీయే దానిని తాత్కాలికంగా పక్కన పెట్టింది.
అదే సమయంలో విజయవాడను రైల్వే జోన్గా చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖకే రైల్వే జోన్ బెట్టర్ అని చాలామంది భావిస్తున్నారు. విశాఖవాసులకు కూడా రైల్వే జోన్ అంశం సెంటిమెంట్గా మారిందని చెప్పవచ్చు. అలాంటిది విజయవాడకు జోన్ వెళ్తుందంటే ఉత్తరాంధ్రవాసులు జీర్ణించుకునే పరిస్థితి లేదు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖలోనే రైల్వే జోన్ కావాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఏపీ బీజేపీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే హోదాతో ఇబ్బందుల్లో పడిన బీజేపీ.. రైల్వే జోన్ విషయంలో కూడా వెనక్కి పోతే మరిన్ని చిక్కులు తప్పవు. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి, ఢిల్లీ పెద్దలకు చెప్పారు. దీంతో కూడా విశాఖకే రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో, ఒడిశా, చత్తీస్గఢ్లను బుజ్జగించే పనిలో పడ్డారని తెలుస్తోంది.