రూ.1,981 కోట్ల చెక్కు చంద్రబాబు చేతికి, సుజనా చౌదరి చొరవ అన్న ఉమా
పోలవరం నిర్మాణ పనులను పరుగు పెట్టించేందుకు కేంద్రం నాబార్డు ద్వారా తొలి విడత రుణం విడుదల చేసింది. రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ముందడుగు పడింది. నిర్మాణ పనులను పరుగు పెట్టించేందుకు కేంద్రం నాబార్డు ద్వారా తొలి విడత రుణం విడుదల చేసింది. రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.
బాబుకు ఊరట, జగన్కు మింగుడుపడని 'భూమా'!: కార్పోరేషన్ కోసం పావులు
ఈ నెల 30వ తేదీ నుంచి పోలవరం కాంక్రీట్ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అత్యంత ప్రధానమైన స్పిల్ వే, డయా ఫ్రం వాల్ నిర్మాణం డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు లభించాయి. చెక్కు ఇస్తున్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
సంతోషంగా ఉంది: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ రంగంలో బీమా పైన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారని చెప్పారు. నదుల అనుసంధానానికి మాజీ ప్రధాని వాజపేయి హయాంలోనే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
2018 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 540 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతుందన్నారు. తాను ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నానని చెప్పారు.
ఎప్పుడు పిలిచినా వస్తా, సుజన చొరవ చూపారు: ఉమాభారతి
చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఉమాభారతి అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన బృందంతో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు తాను సిద్ధమని చెప్పారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పోలవరం నిధుల విషయంలో కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చొరవ చూపారన్నారు. చంద్రబాబు నదుల అనుసంధానం ప్రారంభించారని కితాబిచ్చారు.