కొత్త జిల్లాలకు కేంద్రం అడ్డంకుల్లేవ్- జూన్ వరకూ గడువు-అందుకే జగన్ సర్కార్ ప్రకటన
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసిందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఓవైపు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వగా.. మరోవైపు డిసెంబర్ లో జిల్లాల సరిహద్దుల మార్పుకు సంబంథించి కేంద్రం ఇచ్చిన అనుమతి ఉత్తర్వులు కూడా వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడిందన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.
గతేడాది డిసెంబర్ లో కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాలు తమ జిల్లాల సరిహద్దుల్ని మార్చుకునేందుకు ఈ ఏడాది జూన్ వరకూ అనుమతి ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా జనగణన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల మార్పు ప్రక్రియపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు రాష్ట్రాలకు ఈ మేరకు అనుమతిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏదైనా రాష్ట్రం జిల్లాల సరిహద్దుల్ని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఈ మార్పులన్నీ ఈ ఏడాది జూన్ లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది..
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది జూన్ లోగా రాష్ట్రాల్లోని జిల్లాల సరిహద్దుల్ని మార్చుకునేందుకు అనుమతి లభించడంతో ఏపీ ప్రభుత్వం ఆ మేరకు జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతిపాదిత జిల్లాలు, వాటి పేర్లను ముసాయిదా నోటిఫికేషన్ రూపంలో ఇచ్చిన ప్రభుత్వం.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించే పనిలో ఉంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాల విభజన ఉగాది నుంచి అమల్లోకి వచ్చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అదికారులు జిల్లాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రంగంలోకి దిగారు. కొత్త కలెక్టరేట్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టిసారిస్తున్నారు. దీంతో ఉగాది నాటికి కొత్త జిల్లాలు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.