కీలక సమయంలో జగన్ కు మోడీ భారీ సాయం - ఆ 8 వేల కోట్లు ఎలా గట్టెక్కించాయంటే....
కరోనా సంక్షోభ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ ఆర్ధికంగా కుదేలయ్యాయి. రాబడులు తగ్గిపోయి కొత్తగా ఆదాయ మార్గాలు లేక విలవిలలాడాయి. కానీ అదే సమయంలో కేంద్రం కొన్ని షరతులతో రాష్ట్రాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. పలు రాష్ట్రాలు షరతులను అంగీకరించేందుకు సిద్ధం కాగా... తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఏపీ మాత్రం ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడమే కాకుండా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వగలుగుతోంది.
జగన్ సర్కార్ను వదలని రంగుల మరక: సుప్రీంలోనూ ఎదురుదెబ్బే: హైకోర్టు ధిక్కరణ అంటూ
కరోనా సంక్షోభంలో ఏపీ...
కరోనా లాక్ డౌన్ విధించిన వారం రోజుల్లోనే ఆదాయాలు పడిపోవడంతో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వాల్సిన పరిస్ధితి ఏపీ సర్కార్ కు తలెత్తింది. ఇందులో నుంచి బయటపడే మార్గాలు కూడా లేకపోవడంతో ప్రభుత్వం జీతాల్లో కోత విధిస్తూనే సంక్షోభం నుంచి గట్టెక్కగానే మిగిలిన మొత్తాల్ని చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ దాటాక మే నెల జీతాలకూ అదే పరిస్ధితి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు దాదాపుగా పడిపోయిన పరిస్దితుల్లో జగన్ సర్కారు ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించిందనే చర్చ మొదలైంది. ధనిక రాష్ట్రమని చెప్పుకునే హైదరాబాద్ రాజధాని కలిగిన తెలంగాణతో పోలిస్తే జగన్ సర్కారు అనుసరించిన వ్యూహమేంటనే చర్చ కూడా సాగింది.
షరతులతో ఆదుకున్న కేంద్రం...
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల వాటాతో పాటు ప్రత్యేక సాయాన్ని కూడా విడుదల చేసింది. ఇందుకోసం కొన్ని షరతులువిధించినా ఏపీ సర్కార్ వాటికి అంగీకారం తెలపడంతో కేంద్రం నుంచి రెండు విడతలుగా మొత్తం 8 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదలయ్యాయి. అప్పటికే నెలకు కేవలం 1300 కోట్ల రూపాయల ఆదాయంతో ఇబ్బందులు పడుతున్న ఏపీకి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మే 27వ తేదీ వరకూ లెక్కలను తీసుకుంటే రాష్ట్రానికి వివిధ పన్నులు, వసూళ్ల రూపంలో దాదాపు 42 వేల కోట్లు రాగా... రూ.43,500 కోట్ల ఖర్చులు అయ్యాయి. వీటిలో 38 వేల కోట్లు రెవెన్యూ ఖర్చులే కాగా.... మరో 5500 కోట్లు జీతాలు, పింఛన్లకు ఖర్చుపెట్టారు. ఇలాంటి సమయంలో కేంద్ర సాయం భారీగా అక్కరకొచ్చింది.
ఆదుకున్న రూ.8 వేల కోట్లు...
కేంద్రం నుంచి ఈ రెండు నెలల కాలంలో రూ.3690 కోట్లు పన్నుల వాటా రూపంలోనూ, మరో రూ.5218 కోట్లు ఇతరత్రా సాయాల రూపంలోనూ ఏపీ ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఆర్దిక సంఘం గ్రాంట్లుగా రూ.1791 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.982 కోట్లు, విపత్తు నిర్వహణ కింద రూ.560 కోట్లు, పట్టణ స్ధానిక సంస్ధలకు రూ.249 కోట్లు వచ్చాయి. కీలక సమయంలో అందిన ఈ నిధుల వల్లే ఏపీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి బయటపడింది.
Recommended Video
ఏపీకీ, తెలంగాణకూ వ్యత్యాసం కూడా ఇదే...
కేంద్ర సాయంతో ఏపీలో ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపు, ఇతర వ్యయాలు చేయడం సాధ్యమైంది. ఇప్పటికే ఏపీలో ఉద్యోగులకు పూర్తి జీతం, పూర్తి పింఛన్లు ఇస్తుండగా.. తెలంగాణలో మాత్రం కోతలు తప్పడం లేదు. దీనంతటికీ కారణం కేంద్రం నుంచి ఏపీకి అందిన సాయమే. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఉద్యోగుల పరిస్ధితి మెరుగ్గా ఉండటంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కేసీఆర్ ఈ విషయం వెల్లడించారు.