మూడు రాజధానులపై మళ్లీ తేల్చిన కేంద్రం: హైకోర్టులో అఫిడవిట్: శివరామకృష్ణన్ కమిటీ: స్టేటస్ కో
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరోమారు స్పష్టం చేసింది. మూడు రాజధానులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్పై స్టేటస్ కో కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టేటస్ కో అంశం ఈ నెల 27వ తేదీన హైకోర్టు సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ అత్యంత కీలకంగా మారొచ్చని అంటున్నారు.
కేంద్రం క్లారిటీ..
మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో అటు ప్రతిపక్షాల నుంచి ఘాటు విమర్శలు, ఇటు అమరావతి ప్రాంత రైతుల నుంచి అదే స్థాయిలో నిరసనలను ఎదుర్కొంటోంది జగన్ సర్కార్. ఈ పరిణామాల మధ్య కేంద్రం ఇచ్చిన స్పష్టత.. ప్రభుత్వానికి రిలీఫ్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకు పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర రాజధానులను నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్రం పరిధిలోనే..
రాజధానిని ఎక్కడ నిర్ణయించాలనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో కేంద్రం పాత్ర ఉండదని పేర్కొంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ లలిత టీ హెడావూ పేరు మీద ఈ అఫిడవిట్ దాఖలైంది. ఎక్కడి నుంచి పరిపాలించాలనే విషయాన్ని తాము రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించలేమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు అనువైన ప్రాంతంలో నుంచి గానీ, అభివృద్ధి చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలనను కొనసాగించవచ్చని పేర్కొంది. దీనిపై పూర్తి అధికారాలు రాష్ట్రాల ప్రభుత్వాలదేనని వెల్లడించింది.
హైకోర్టులో కౌంటర్..
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై విచారణ సందర్భంగా ఈ అఫిడవిట్ను సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. కేంద్రానికి కూడా నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని ఆదేశించింది.
శివరామకృష్ణన్ కమిటీని ప్రస్తావించిన కేంద్రం
తాను హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ సూచనలను ప్రస్తావించింది. విభజన అనంతరం ఏర్పడిన ఏపీకి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 28వ తేదీన శివరామకృష్ణన్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొంది. అదే ఏడాది ఆగస్టు 30వ తేదీన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందజేసిందని స్పష్టం చేసింది. 2015 ఏప్రిల్ 23 తేదీన అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వివరించింది.
కౌంటర్ అఫిడవిట్లో కీలకాంశాలు.. కామెంట్లు..
రాజధానిని ఎక్కడ నిర్ణయించుకోవాలనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని తేటతెల్లం చేసింది. చట్టసభల్లో చర్చించిన అంశాలు కూడా న్యాయ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, పరిపాలనలో భాగంగా ఎదురైన పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయం తమ దృష్టికి వచ్చిందని తేల్చింది.