అమిత్ షా కాన్వాయ్పై దాడి మీద రిపోర్టివ్వండి: కేంద్రం సీరియస్, 'టీడీపీ మూల్యం చెల్లిస్తుంది'
అమరావతి/న్యూఢిల్లీ: ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడి కాన్వాయ్ పైనే దాడి ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఈ దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని రిపోర్ట్ అడిగింది. అలిపిరి ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించింది.
చదవండి: ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ పైన అలిపిరిలో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రం సీరియస్గా తీసుకొని నివేదిక కోరింది. రాష్ట్ర పోలీసులు ఇందుకు సంబంధించిన నివేదికను పంపించనున్నారు. ఏం జరిగిందనే విషయాన్ని రిపోర్టులో పొందుపర్చనున్నారు.
చదవండి: అమిత్ షా కాన్వాయ్పై దాడి, బాబు వైపు బీజేపీ వేళ్లు: ఇదీ జరిగింది.. ఏమైందో చెప్పిన ఎమ్మెల్యే
ఆందోళనపై ఫిర్యాదు చేసినా లైట్గా తీసుకున్నారు
మరోవైపు, పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా తమ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే ఓ నివేదిక పంపించారని తెలుస్తోంది. టీడీపీ వారు ఈ దాడికి పాల్పడినట్లుగా అందులో పేర్కొన్నారని తెలుస్తోంది. అమిత్ షా రాక సమయంలోనే టీడీపీ నేతల ఆందోళనపై బీజేపీ ముందే ఫిర్యాదు చేసిందని, కానీ దీనిని రాష్ట్ర యంత్రాంగం లైట్గా తీసుకుందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కాగా, అమిత్ షా కాన్వాయ్పై ఓ టీడీపీ కార్యకర్త రాయి విసిరింది. ఆ రాయి షా కారుపై కాకుండా మరో కారుపై పడి అద్దం పగిలింది. వెంటనే తేరుకున్న పోలీసులు షా కాన్వాయ్ను విమానాశ్రయానికి భద్రంగా పంపించారు.
టీడీపీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిక
అలిపిరి ఘటనపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. బీజేవైఎం నేత రమేష్ నాయుడు మాట్లాడుతూ.. అలిపిరి ఘటన దారుణమన్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణం అన్నారు. అలిపిరి ఘటనను బీజేపీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమన్నారు.
చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అమిత్ షా కాన్వాయ్పై దాడి ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పరిగి బస్టాండు వద్ద కూడా ఏపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలుగుదేశం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
చంద్రబాబు నష్టనివారణ చర్యలు
మరోవైపు, అలిపిరి ఘటనపై చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే, ఈ ఘటనను తాను కూడా ఖండించానని, ఇలాంటి దాడులు సరికాదని తాను చెప్పానని ఆయన అంటున్నారని గుర్తు చేస్తున్నారు. అలాగే, పోలీసుల వైఫల్యం ఉందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఇలా నష్ట నివారణ చర్యలు చేపట్టారని అంటున్నారు.
ఈ దాడిలో భద్రతా వైఫల్యం
కాగా, అమిత్ షా కాన్వాయ్పై తిరుపతిలో జరిగిన టీడీపీ కార్యకర్తల దాడితో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. 2014 నుంచి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అమిత్ షా పర్యటనలో భద్రతను గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో డొల్లతనం బయటపడిందని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంటలిజెన్స్ ఆరా తీయగా, రాళ్లు రువ్వడంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు స్థానికులను అరెస్టు చేశారు. ఘటనపై ఐబీ వర్గాలు ఆరా తీశాయి.