దారితప్పిన ఏపీ ఎంపీల్యాడ్స్ నిధులు?: వివరణ కోరుతూ కేంద్రం లేఖ, రఘురామ ఫిర్యాదు
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చుచేయలేదని ఫిర్యాదులు అందడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొంది కేంద్రం. ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ.
నిబంధనల అనుగుణంగా ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది కేంద్రం. మత పరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మత్తుల కోసం ఎంపీలాడ్స్ నిధులు కేటాయించారన్న ఫిర్యాదు మేరకు వివరణ కోరింది కేంద్రం.
ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదు మేరకు ప్రధాని కార్యాలయం స్పందించిందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర గణాంకశాఖ పేర్కొంది. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ చర్చి నిర్మాణం, మరమ్మతుల కోసం రూ. 86 లక్షలు ఖర్చు చేయడం సహా చాలా చోట్ల ఇదే తరహాలో వ్యయం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ నుంచి వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు పీఎంవో ఆదేశాలు ఇచ్చింది.
ఎంపీలాడ్స్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్రస్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులు కూడా నిబంధనలు పాటించడం లేదని కేంద్రం లేఖలో పేర్కొంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అన్ని నోడల్ విభాగాలతోనూ ఆడిట్ నిర్వహించి అవి దుర్వినియోగం కాకుండా చూడాలని కేంద్రం సూచించింది.ఎంపీ లాడ్స్ కింద ప్రతి ఎంపీకి కేంద్రం ఏటా 5 కోట్ల నిధులు ఇస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చుచేయాల్సి వుంటుంది.