తగ్గేదే లే..జగన్ సమర్ధతకు పరీక్ష: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం : దానికే కట్టుబడి ఉన్నాం..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో కేంద్రం తగ్గేదే లే అంటోంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసినా..అన్ని పార్టీల నేతలు అభ్యర్ధనలు చేస్తున్నా..కార్మికులు పోరాటం ప్రారంభించాన వెనకడుగు వేసేది లేదని తేల్చి చెబుతోంది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన ప్రశ్న సంధించారు. దీనికి కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ జవాబిచ్చారు. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని అందులో తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఇదే అంశం పైన ఏపీ అసెంబ్లీలో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభత్వం తీర్మానం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహకరించుకోవాని కోరింది. ముఖ్యమంత్రి నేరుగా ప్రధాని మోదీకి...కేంద్ర ఉక్కు శాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు అప్పట్లోనే లేఖలు రాసారు. అందులో ప్రయివేటీకరణ అవసరం లేకుండానే ఏ రకంగా లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందనే అంశాలను వివరించారు. ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రులను కలిసి మరో సారి అభ్యర్ధించారు.
ఇక, ఇప్పటికే రాజకీయంగా టీడీపీ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ అంశం సీఎం జగన్ కు సమస్యగా మారుతోంది. జగన్ ముందుండి ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా చూడాలని...ఆయన మార్గంలో నడించేందుకు తాము సిద్దమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తాజాగా, టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలోనూ ప్లాంట్ కు మద్దతుగా టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్దమని స్పష్టం చేసారు. ఇక, పార్లమెంట్ రెండు రోజుల సమావేశాల్లో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్లాంట్ కార్మికులు ఇప్పటికే నిరసనలకు దిగారు.
కానీ, కేంద్రం నుండి మాత్రం ఎటువంటి సానుకూల స్పందన రావటం లేదు. ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఈ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం కనిపించటం లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ దీనిని ఏ రకంగా అడ్డుకోగలుగుతారు... కేంద్రాన్ని ఒప్పించగలుగుతారా..లేకుంటే, రాజకీయంగా నష్టపోతారా..కార్మికులకు ఏం సమాధానం చెబుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.