జగన్ కు మరో వరమిచ్చిన కేంద్రం- బెంగళూరు-కడప- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే- గడ్కరీ ట్వీట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం.. వరుసగా గ్రీన్ ఫీల్డ్ రహదారుల్ని కేటాయిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరు-కడప-విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీని వల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గబోతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ట్వీట్ చేశారు.
జగన్ కు కేంద్రం మరో వరం
కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న వైఎస్ జగన్ కు ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు రహదారులతో పాటు ఆర్వోబీ, ఆర్యూబీలను కేటాయించి వెళ్లారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీని మరింత పెంచేందుకు వీలుగా కొత్త రహదారుల్ని కూడా కేటాయిస్తున్నారు. ఇదే క్రమంలో మరో గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
విజయవాడ-కడప-బెంగళూరు హైవే
తాజాగా విజయవాడ-కడప-బెంగళూరు మధ్య అత్యాధునిక సదుపాయాలతో గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను నిర్మించబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇది కర్నాటకతో పాటు ఏపీలోని రెండు ప్రధాన నగరాల్ని అనుసంధానం చేస్తుందని గడ్కరీ వెల్లడించారు. అమరావతి రాజధానిలో భాగంగా ఉన్న విజయవాడతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న కడప నగరాన్ని ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కలపబోతోంది. అలాగే ఏపీ-కర్నాటక సరిహద్దుల్లోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44లో అనంతపురం జిల్లా కొండికొండ దగ్గర మొదలయ్యే ఈ జాతీయ రహదారి.. ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలోని చెన్నె-కోల్ కతా జాతీయ రహదారి 16కు ఇది కలుస్తుంది.
గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రయోజనాలివే..
విజయవాడ-కడప-బెంగళూరు మధ్య అభివృద్ధి చేసే గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను రూ.13600 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ ట్వీట్ లో తెలిపారు. దీని వల్ల విజయవాడ-బెంగళూరు మధ్య 75 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 5 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత, ప్రతిపాదిత ఆర్ధిక, పారిశ్రామిక నోడ్ లు అయిన గుంటూరు, కడప, కొప్పర్తిలను అనుసంధానం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. 2025-26 కల్లా ఇది పూర్తవుతుందని గడ్కరీ వెల్లడించారు.