త్వరలో తీపి కబురు: విశాఖకు రైల్వే జోన్పై హరిబాబు, కడప స్టీల్ ప్లాంట్పై..
విశాఖపట్నం: తన పదవి ముగిసేలోగా విశాఖపట్నంకు రైల్వే జోన్ వస్తుందని బీజేపీ లోకసభ సభ్యులు కంభంపాటి హరిబాబు చెప్పారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కూడా ఆయన మాట్లాడారు. ఏపీలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, వెంకయ్య నాయుడు ఏర్పాటు చేసిన కమిటీ ఫిబ్రవరిలో ఓ నివేదిక కూడా ఇచ్చిందన్నారు.
మెకాన్, విశాఖ స్టీల్స్తో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీడీపీ ఎంపీలు కావాలనే చెప్పి రాజకీయాలు చేస్తున్నారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు.
అయితే తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్ను విభజించే ప్రక్రియ, కొత్తజోన్ ఏర్పాటుకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. రాజకీయపరంగా మరికొన్ని చర్చలు జరిగాక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు కొత్త జోన్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తుందన్నారు. సాంకేతిక అడ్డంకులు, ఇతర పరిస్థితుల కారణంగా జాప్యం అవుతోందని, జోన్ ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకంగా లేదన్నారు. త్వరలోనే తీపి కబురుకు రంగం సిద్ధమవుతోందన్నారు.
గత ఏడాది కేటాయించిన విశాఖ-వారణాసి కొత్త రైలు త్వరలోనే పట్టాలెక్కనుందన్నారు. రైల్వే బోర్డు ర్యాక్ మంజూరుచేసిన వెంటనే కొత్త రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖ మీదుగా హైదరాబాద్, హౌరా మధ్య కొత్త అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటీవల విశాఖ మీదుగా ప్రవేశపెట్టిన సంత్రాగచ్చి-చెన్నె సెంట్రల్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతోందన్నారు.