కేంద్రం ఆలోచిస్తోంది.. హోదా ఎప్పుడో, అది బాబు బాధ్యతే: హరిబాబు షాక్
విశాఖ/విజయవాడ: విభజన కారణంగా నష్టపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా ఆదుకోవాలనే విషయమై కేంద్రం ఆలోచన చేస్తోందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సోమవారం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్రం ఏపీకి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని కేంద్రం కల్పిస్తుందని హరిబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలో కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఏపీకి రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని చెప్పారు. రాజధానికి భూమి ఏవిధంగా సేకరించాలనేది ప్రభుత్వం నిర్ణయమే అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చేయడాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హోదా అంశం కేంద్రం పరిశీలనలో ఉందని, అయితే ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పారు. పట్టిసీమ మాదిరిగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఖర్చు పెట్టిన నిధులను ఎప్పటికప్పుడు ఇప్పిస్తామని చెప్పారు. రెవెన్యూ లోటు కేంద్రం భర్తీ చేస్తుందన్నారు.
ఈ నెల 20వ తారీఖున తాడేపల్లిగూడంలో నిట్కు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీలు శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. విశాఖలో ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీకి మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేస్తారన్నారు.
రోజాకు మతిభ్రమించింది: రావెల
సెక్షన్ 8 పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు విజయవాడలో మండిపడ్డారు. సెక్షన్ 8 పైన ఆమెకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామన్నారు.
ఇంటికో ఉద్యోగం కోసం ఆందోళనలు: శైలజానాథ్
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ పైన శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన సిఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
నిరుద్యోగ భృతి రూ.2వేలు హామీలు కూడా అమలు కాలేదన్నారు. తక్షణమే లక్షా ముప్పై వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో ఉద్యోగం రాలేదని దినేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం బాధ్యత వహించాలన్నారు. కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.