హోదాపై తేల్చేసిన జైట్లీ!: విభజనతో ఏపీకి తీవ్ర నష్టం, హైద్రాబాద్లాంటి సిటీ లేకే ఇబ్బంది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హుళక్కేనా! అంటే అవుననే అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవే సంకేతాలు ఇచ్చారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదకుంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లాంటి గొప్ప నగరం లేక ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఏపీకి ఆర్థిక లోటును భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో సాయం చేస్తామన్నారు. తొలి ఏడాది వీలైనంత ఆర్థిక సాయం చేశామని చెప్పారు. అంచనా కంటే ఎక్కువ పరిహారం అందేలా చూస్తామని ఆయన చెప్పారు.
అరుణ్ జైట్లీ లోకసభలో ప్రకటన చేశారు. ఏపీ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందన్నారు. హైదరాబాద్ దేశం గర్వించదగ్గ నగరమని, దానిని కోల్పోవడంతో ఏపీ ఆదాయం బాగా పడిపోయిందన్నారు. అందువల్లే ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధిలో ఏపీ తమకు చాలా ప్రధానమైదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక నష్టాలను అధిగమించేలా సహకరించడం తమ అజెండాలో ఉందని చెప్పారు. అభివృద్ధి రేటు 9కి చేరితే అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏపీకి ఆర్థిక తోడ్పాటును అందించడమే ధ్యేయమని చెప్పారు.
అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. జైట్లీ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, అయితే, అంతకుమించి సాయం చేస్తామనే అభిప్రాయం కనిపిస్తోందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీపై కొనకళ్ల ఆగ్రహం
పార్లమెంటు ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరమని ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ఎంపీలను కొట్టించి తలుపులు మూసివేసి విభజన బిల్లు పాస్ చేయించారన్నారు. ఆ విషయం అప్పుడే మర్చిపోయారా అన్నారు.
విభజన హామీలు ఒక్కటొక్కటిగా అమలు అవుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన చేయడంలో అర్థం లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి లాంటి వారి హోదా గురించి మాట్లాడటం అమ్మను చంపి కర్మ బాగా చేయాలన్నట్లు ఉందన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలతో సిఎస్ కృష్ణారావు భేటీ
ఉద్యోగ సంఘాల నేతలతో సిఎస్ కృష్ణారావు బుధవారం భేటీ అయ్యారు. అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపుపై చర్చిస్తున్నారు. వసతుల పైన ఉద్యోగ సంఘాల నేతలతో సిఎస్ చర్చిస్తున్నారు.
వీలైనంత త్వరగా కార్యాలయాలను అమరావతికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలింపుపై ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. అమరావతి పరిధిలో స్థలాల గుర్తింపుకు జవహర్ రెడ్డి కమిటీని నియమించారు.