ఏపీకి మోడీ ప్రాధాన్యత, 2024 దాకా ప్రధానిగా: వెంకయ్య, అమరావతిపై బైరెడ్డి ప్రశ్న
గుంటూరు: ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నాడు చెప్పారు. గుంటూరు జిల్లా లాంఫాంలో సోమవారం నిర్వహించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. విజయవాడలో దుర్గగుడి వద్ద ఫ్లైవంతెన నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందరం కలిసి ఏపీని అగ్రరాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్నారు.
కొత్త రాజధానికి కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయన్నారు. త్వరలో కర్నూలు జిల్లాలో రక్షణ కర్మాగారం రానుందన్నారు. ఇది దక్షిణ భారత్లోనే అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. 2900 ఎఖరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా గుగ్గిరాల కొండలో మరో రక్షణ కర్మాగారం రానుందన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరులో ఓ ప్రాజెక్టు వస్తుందన్నారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయన్నారు. మోడీ ప్రధాని కావడం ఇష్టం లేనివారంతా అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 2024 వరకు దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉంటారన్నారు.
చంద్రబాబు సమీక్ష
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద నీటితో చెరువులను నింపాలని ఆదేశించారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పర్యవేక్షణకు అధికారులను నియమించాలన్నారు.
కాగా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల పదకొండు చెరువులకు గండ్లు పడ్డాయి. చిత్తూరు తదితర జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయని చెప్పారు.
శ్రీభాగ్ ఒప్పందం ఉల్లంఘించారు: బైరెడ్డి
శ్రీభాగ్ ఒప్పందమే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి మూలమని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఒప్పందానికి కాలం చెల్లిస్తే మహత్మా గాంధీ, ఎన్టీఆర్కుకాలం చెల్లినట్లేనా అని ప్రశ్నించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమరావతిని రాజధానిగా ప్రకటించాలన్నారు. దీనిని నిరసిస్తూ వచ్చే నెలలో బస్సుయాత్ర చేపడతామన్నారు.