ఓకే చెప్పిన ఈసీ : ఊపిరి పీల్చుకున్న సోమిరెడ్డి: లేకుంటే రాజీనామా చెయ్యాల్సి వచ్చేది..!
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా తప్పించుకున్నట్లే. ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆయన సమీక్షకు హాజరయ్యేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది. వరుసగా రెండు రోజుల పాటుగా సమీక్షలు ఏర్పాటు చేసి అధికారులు రాక భంగపాటుకు గురైన మంత్రి సోమిరెడ్డి అవసరమైతే రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. అయితే, ఏపిలో నెలకొన్ని పరిస్థితుల్లో అధికారులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
సేమ్ సీన్ రిపీట్ : తేల్చుకోవటానికి సిద్దం: మంత్రి పదవి కొత్త కాదు..సోమిరెడ్డి : సీఈసీకి బాబు లేఖ
సోమిరెడ్డికి ఊరట..
ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊరట లభించింది. తన శాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించేందుకు రెండు రోజుల పాటు అధికారుల కోసం నిరీక్షించిన సోమిరెడ్డి అసహనానికి గురయ్యారు. శుక్రవారం మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించి..ముందుగానే అధికారులకు సమాచారం పంపారు. ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని సంప్రదించారు. తాము సమీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా సమీక్ష నిర్వహించవచ్చని..అందులో పాల్గొనేందుకు సీఈఓ అనుమతిచ్చారు. ఏపీలోని కరువు..పంట నష్టాలు..ఖరీఫ్ సీజన్కు సమాయత్తం పైన ఈసమీక్షలో చర్చింనున్నారు.
అధికారుల తర్జన భర్జన..
ఇక వైపు ముఖ్యమంత్రి స్థాయిలోనే సమీక్షలను నిలిపివేసారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు సీఎం తో సహా మంత్రుల సమీక్షలకు హాజరు కావద్దని ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. దీంతో..ముఖ్యమంత్రి పరిస్థితి అంచనా వేసి సమీక్షలకు దూరంగా ఉన్నారు. మంత్రి సోమిరెడ్డి మాత్రం రెండు దఫాలు సమీక్షలకు హాజరుకావాలని అధికారులను సమాచారం పంపారు. అయినా అధికారులు హాజరు కాలేదు. దీనిపై మంత్రి నేరుగా అధికారులను సంజాయిషీ కోరారు. ఈ విషయాన్ని వారు సీఎస్తో పాటుగా సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సైతం సానుకూలంగా స్పందించారు. ఫలితంగా అనేక తర్జన భర్జనల తరువాత అధికారులతో మంత్రి సమీక్షకు ముహూర్తం ఖరారైంది.
రాజీనామా చేయాల్సి వచ్చేదా..
ఏపీలో పోలింగ్ ముగిసిన నాటి నుండి సీయంతో సహా మంత్రులు ..అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్దం సాగుతోంది. సీఎస్ ఆదేశాల మేరకు అధికారులు ఎవరి సమీక్షలకు హాజరు కావటం లేదు. దీంతో..మంత్రి సోమిరెడ్డి తాను తన శాఖ పైన సమీక్ష నిర్వహిస్తానని..అధికారులు హాజరు కాకపోతే తన పదవికి రాజీనామా చేయటంతో పాటుగా ఎన్నికల సంఘం పైన పోరాటం చేస్తానని హెచ్చరించారు. అయితే, వరుసగా రెండు రోజుల పాటు అధికారలు మంత్రి సమీక్షకు డుమ్మా కొట్టారు. దీంతో..సోమిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అనే చర్చ సైతం సాగింది. కానీ, మంత్రి నేరుగా అధికారులనే వివరణ కోరటం..వారు ఉన్నతాధికారుల అనుమతితో సమీక్షకు హాజరవుతామని చెప్పటంతో ఇప్పుడు మంత్రి సోమిరెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికీ సమస్య అదే విధంగా ఉంటే మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేదనే చర్చ సాగింది.