వామ్మో.. ఏపిలో రీ పోలింగా...!: ఇసినే టెన్షన్ పెడుతున్న ఏపి పార్టీలు : అధికారుల సమర్ధతకు పరీక్ష
Recommended Video
ఏపిలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమర్ధతకు పరీక్షగా మారుతోంది. ఏపిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల సంఘం ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తోంది. ఏపిలోని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అయిదు చోట్ల సీఈఓ రీ పోలింగ్ కు సిఫార్సు చేసారు. ఇక, ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సంఘం పైనే ఆరోపణలు..
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. కానీ, ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం పై మాత్రం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలు వరుసగా ఎన్నికల నిర్వహణలో ఇసి విఫలమైందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏపిలో అధికారుల విషయంలో తీసుకున్న బదిలీ నిర్ణయాలు..పోలింగ్ రోజున ఇవియంల సమస్యలు ఈ విమర్శలకు కారణమయ్యాయి. పోలింగ్ రోజు ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఇవియంల సమస్యలు తలెత్తిన మాట నిజమేనని..అయితే, ఆ తరువాత వాటిని సరిచేసి పోలింగ్ యధావిధిగా కొనసాగించామని సీఈవో చెబుతున్నారు. అయినా..ఏపిలో ఎన్నికల నిర్వహణ పై ఇసి మీద విమర్శలు మాత్ర ఆగటం లేదు. ఎన్నికల నిర్వహణ లో ఇసి విఫలమైందని టిడిపి ఆరోపిస్తోంది.
రీ పోలింగ్ పై నిర్ణయం పెండింగ్..
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వారం రోజులు అవుతోంది. ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా రీ పోలింగ్కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. అయితే, ఇంకా అక్కడి నుండి మాత్రం రీ పోలింగ్ కు సంబంధించి ఇంకా ఆమోదం రాలేదు. ఏపి లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లాల్లో రెండు, నెల్లూరు జిల్లాల్లో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కోసం సీఈసీకి సిఫారసు చేశారు. రీపోలింగ్ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని, ఆ నివేదికను సీఈసీకి నివేదించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ రీపోలింగ్కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది. విశాఖ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ ఘటనలపై ఈసీకి నివేదిక పంపించారు.
ఇసి సమర్ధతకు పరీక్షగా ఏపి ఎన్నికలు..
దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘానికి ఏపిలో ఎన్నికల నిర్వహణ మాత్రం సమస్యలు తెచ్చి పెడుతోంది. ఇవియంల నిర్వహణ పైనా ఏపి రాజకీయా నేతలే ఎక్కువగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవియంల పని తీరు పై టిడిపి అధినేత చంద్రబాబు నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ దగ్గర సందేహాలు లేవనెత్తారు. దీనికి ప్రతిగా సాంకేతిక బృందంతో తమ వద్దకు వస్తే అనుమానాలు నివృతి చేసుకోవచ్చని ఎన్నికల సంఘం టిడిపికి లేఖ రాసింది. అయితే, అందులో టిడిపి సాంకేతికల సలహాదారుడు హరి ప్రసాద్కు అనుమతి లేదని చెప్పటంతో టిడిపి సమావేశానికి వెళ్లలేదు. ఇక, వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పైనే ఇసి స్పందిస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏపిలో ఉప ఎన్నికలు నిర్వహణ..స్ట్రాంగ్ రూంలకు సంబంధించి భద్రత పైనా విమర్శలు మొదలయ్యాయి. దీంతో..మే 23 వరకు ఎన్నికల అధికారుల సమర్ధతకు ఏపి రాజకీయ పార్టీలు పరీక్ష పెడుతున్నాయి.