ఏపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీపై సీజీఎస్టీ దాడులు
హైదరాబాద్: గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన హైదరాబాద్ కార్పోరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆయన పన్నులు కట్టకుండా ఎగవేశారని చెబుతూ ఈ దాడులకు దిగారు. భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో తెలుగదేశం ఎంపీ కార్యాలయంపై దాడులు జరగడం విశేషం. రాయపాటికి చెందిన ఇంజనీరింగ్ మరియు నిర్మాణం కంపెనీ ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ 2012లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది.
ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను బేగంపేట్, కమలాపురికాలనీలో ఉన్నాయి. అంతేకాదు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఈ దాడులు జరగడం చూస్తే ఇది రాజకీయ కక్షచర్య సాధింపేనని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున తమ సిబ్బంది కూడా పట్టించుకోలేదని ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో వారంతా షాక్కు గురయ్యారని రాయపాటి తెలిపారు. మరోవైపు ట్రాన్స్ట్రాయ్ సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయి సిబ్బంది మాత్రం ఇతర వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు.
20212లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.4717 కోట్లు పనులకు 14శాతం టెండర్లు వేసి దక్కించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీనీ ప్రభుత్వం తప్పించాల్సి వచ్చింది. అదే సమయంలో ట్రాన్స్ ట్రాయ్కు అప్పగించిన పనులు నవయుగ చేతికి మారాయి. ఆసమయంలో రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని నరసారావు పేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.