కెసిఆర్ని కల్సిన ఈనాడు ఎండి కిరణ్, తలసాని ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ కెసిఆర్ను కలిసినట్లుగా తెలుస్తోంది. కెసిఆర్ నివాసానికి వచ్చిన కిరణ్... ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
కెసిఆర్ను బుధవారం కలుసుకున్న సినీ ప్రముఖులలో నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, నిర్మాతలు రామానాయుడు, సురేష్ బాబు, నటుడు అలీలు ఉన్నారు. కెసిఆర్ నివాసానికి వచ్చిన సినీ, రాజకీయ ఇతర ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్కు సినీ నటి జమున శుభాకాంక్షలు తెలిపారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించారు.
కెసిఆర్పై తలసాని నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. హైదరాబాదులో తెరాస ఖాళీ అవుతుందనే భయంతోనే కెసిఆర్ మజ్లిస్ పార్టీతో పొతతు పెట్టుకున్నారని విమర్శించారు.
ముందు జాగ్రత్తగా కెసిఆర్ మజ్లిస్ పార్టీతో పొత్తుకు ముందుకు వచ్చారన్నారు. మజ్లిస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెరాస నుంచి కొందరు నేతలు జారుకుంటారన్నారు.