బాబుతో చదలవాడ: అక్కడే, రాఘవేంద్రరావ్ ఆశ్చర్యం
హైదరాబాద్/తిరుమల: తిరుమలను ధర్మక్షేత్రంగా మారుస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా అయిన చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం చెప్పారు. ఆయన ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలను ధర్మక్షేత్రంగా మారుస్తామన్నారు.
శ్రీవారి సేవలో రాఘవేంద్ర రావు, ఆశ్చర్యపోయారు
తిరుమల శ్రీవారిని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు వచ్చిన రాఘవేంద్ర రావుకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో రాఘవేంద్ర రావును శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు.
కాగా, కే రాఘవేంద్ర రావు సోమవారం నాడు సరికొత్త రూపంలో కనిపించారు. ఎప్పుడూ గడ్డంతో ఉండే ఆయన సోమవారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం తిరుమలలో ఉండగానే ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమితులైనట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. తలనీలాలు సమర్పించుకోగానే తాను శుభవార్త విన్నానని చెప్పారు.