బాబుకు భారీ షాక్: జనసేనలోకి టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ, కారణం ఇదే!
అమరావతి/హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ కృష్ణమూర్తి సొంత పార్టీకి గట్టి షాకివ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. ఆయన త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో చదలవాడ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను గురువారం కలిశారు. ఆయన దసరా పర్వదినం రోజున జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదలవాడ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన సంప్రదించారని తెలుస్తోంది. టిక్కెట్ విషయంలో ఆయనకు చంద్రబాబు భరోసా ఇవ్వలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను ప్రయత్నాలు చేశారని, అయితే అసెంబ్లీ ఇంచార్జిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని పక్కన పెట్టే పరిస్థితులు లేకపోవడంతో, అక్కడి నుంచి కూడా హామీ లభించలేదని అంటున్నారు. దీంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్తో చదలవాడ చాలాసేపు చర్చించారని సమాచారం. ఈయన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తిరుపతిలో ఆయన సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. 2009లో తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ పోటీ పెట్టలేదు. టీడీపీ తరఫున సుగుణమ్మ గెలిచారు.
పవన్ కళ్యాణ్ మలి విడత ప్రజాపోరాట యాత్ర
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన మలివిడత జనసేన పోరాట యాత్రను ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఆయన యాత్ర ప్రారంభం కానుంది.