బాబు సూచన మేరకు సామాన్యుడికి...: ప్రమాణం తర్వాత చదలవాడ
తిరుమల: తిరుమల శ్రీనివాసుడి సిన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. టీటీడీ నూతన చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఎక్స్అఫిషియో సభ్యునిగా ఈవో సాంబశివరావు ప్రమాణం చేశారు.
వారితో పాటు టీటీడీ సభ్యులుగా రాఘవేంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, హరిప్రసాద్, రమణ, సుధాకర్యాదవ్, వీరాంజనేయస్వామి, లలితకుమారి, సాయన్న, శేఖర్, అనంత్, సంపత్రవినారాయణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారమహోత్సవానికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణ హాజరయ్యారు.
మరో రెండుమూడు రోజుల్లో మిగతా సభ్యులు సండ్రవెంకటవీరయ్య, కృష్ణమూర్తి, జేఎస్వీప్రసాద్, అనురాధ ప్రమాణం చేసే అవకాశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం అనంతరం పాలకమండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరులో శ్రీవారి నమూనా ఆలయం నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది.
శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజ స్వామి ఆలయంలో మూలవిరాట్ కోసం 450 పట్టుచీరల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే రూ.1.5కోట్లతో రూ.70లక్షల బ్లేడ్లు కొనుగోలు చేయడంతోపాటు తలనీలాల నిల్వకు తిరుపతిలో గోదాము నిర్మించాలని నిర్ణయించారు.
ఆడంబరాలకు పోకుండా టీటీడీ పాలక మండలి ప్రమాణం స్వీకారం జరిగినట్టు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. విఐపీ సేవలను తిరస్కరించామని, చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.