జగన్పై కేసులు: నిజం చెప్పిన చంద్రబాబు, సోనియాను ధిక్కరించినందుకే...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంపై ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. తెలిసో తెలియకో చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపడ్డాయి.
తన వాదననే ఖండించే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మీద నమోదైన కేసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. జగన్ను ఆర్థిక నేరస్థుడిగా నిత్యం తిట్టిపోస్తున్న చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కాస్తా భిన్నంగా ఉంది.
చంద్రబాబు చెప్పింది ఇదీ...
లెక్కలేని తనంతోతన పార్టీ హైకమాండ్నే సవాల్ చేశాడని, వాళ్లకు కడుపు మండి కోర్టు ద్వారా జైలుకు పంపించారని చంద్రబాబు ఇంటర్వ్యూలో అన్నారు. జగన్ తప్పు చేశారా, లేదా అనేది పక్కన పెడితే రాజకీయ కారాణాల వల్లనే ఆయనపై కేసులు నమోదయ్యాయనేది చంద్రబాబు మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
జగన్ చెప్పేది ఇదీ...
తాను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ధిక్కరించడం వల్లనే తనపై కేసులు పెట్టించారని వైఎస్ జగన్ నెత్తి నోరూ కొట్టుకుని చెబుతున్నారు. తాను సోనియా గాంధీకి దాసోహం అంటే తనపై కేసులు ఉండేవి కావని ఆయన అంటున్నారు. దానికి మరో వాదనను కూడా జగన్ చేరుస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయి తనపై కేసులు పెట్టించారని ఆయన విమర్శిస్తున్నారు.
మళ్లీ చంద్రబాబు ఇలా...
ప్రతి వారం కోర్టుకు హాజరయ్యేవాడికి, చిప్పకూడు తిన్నవాడికి ఓట్లు ఎవడేస్తాడని చంద్రబాబు జగన్పై అన్నారు. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు చేయడం వల్లనే జగన్పై కేసులు పెట్టారని, ఆయనను జైలుకు పంపించారని చంద్రబాబు అంగీకరిస్తూనే ఆ మాటలన్నారు.
గ్రూపులు కట్టడం చంద్రబాబుకు అలవాటేనా..
తనకు ఓ ఎంపి, ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు మంత్రి పదవి ఇవ్వాలని మర్రి చెన్నారెడ్డిని అడిగానని చంద్రబాబు చెప్పుకున్నారు. అప్పుడే మంత్రి పదవా అని చెన్నారెడ్డి అన్నట్లు తెలిపారు. కాంగ్రెసు నుంచి ఎమ్మెల్యే కాగానే చంద్రబాబు గ్రూపులు కట్టడం ప్రారంభించారని ఆయన మాటల ద్వారానే అర్థమవుతోంది.