వైదొలగుతున్న ఛైర్మన్లు: ఎస్వీబీసీకి దర్శకేంద్రుడి రాజీనామా: వింత కారణం!
తిరుపతి: రాష్ట్రంలో అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూడటంతో.. నామినేటెడ్ పదవులు ఒక్కటొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ రాజీనామాల పర్వానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దీనికి శ్రీకారం చుట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోన్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్గా ఉన్న ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్కు అందజేశారు. వయోభారం కారణంగా ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్నారు. వయోభారం అనేది కారణం కానే కాదని, ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తనకు ఇన్నిరోజుల పాటు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాసుడి ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. 2018లో దర్శకేంద్రుడిని ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్గా నియమించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పటిదాకా ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా కొనసాగారు.
కాగా- టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఆయన కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున.. నామినేటెడ్ పదవుల్లో కొనసాగకూడదనే నిబంధనను దృష్టిలో ఉంచుకుని ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు.