రాజ్యసభలో ట్విస్ట్: లాస్ట్ మినట్లో 'చేయి'చ్చిన ఆదాల
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఎన్నికలు తప్పడం లేదు. ఆరు ఖాళీలకు ఎనిమిది మంది నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ నేతలు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు రెబల్ అభ్యర్థులుగా సమైక్యాంధ్ర కోసమంటూ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెసు పార్టీ వారిని బుజ్జగించడంతో శుక్రవారం వారిద్దరు తొలుత తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రెబల్ అభ్యర్థులను తప్పించే బాధ్యతను అధిష్టానం ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన వేసింది.
కిరణ్ వారితో చర్చలు జరిపి ఒప్పించారు. అధిష్టానం నేతలు కూడా పలువురు నేతల ద్వారా బుజ్జగించారు. దీంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉపసంహరించుకునేందుకు వీలుంది. ఆదాల, చైతన్య రాజుల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సమైక్యాంధ్ర కోసం నామినేషన్ ఉపసంహరించుకోవాలని కిరణ్ కోరడంతో చైతన్య రాజు అంగీకరించారు.
ఆదాల ట్విస్ట్
మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు చైతన్య రాజును దగ్గరుండి నామినేషన్ ఉపసంహరింప చేశారు. ఆదాల ప్రభాకర్ వస్తారని భావించినా రాలేదు. ఆదాల గైర్హాజరీలో మరో నేత ఆయన సంహరించుకుంటున్నట్లు ఓ లేఖను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. అయితే, రిటర్నింగ్ అధికారి ట్విస్ట్ ఇచ్చారు. ఆదాల రాకుండా నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటు కాదని చెప్పారు. ఆయన స్వయంగా వచ్చి ఉపసంహరించుకోవాలని చెప్పారు. దీంతో రాజ్యసభ ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి.
పోటీ నుండి తప్పుకోలేదు
ఆదాల కూడా పోటీ నుండి తప్పుకుంటారని కాంగ్రెసు నేతలు చెప్పినప్పటికీ తాను పోటీ నుండి తప్పుకోలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. మొదట వెనక్కి తగ్గేందుకు అంగీకరించిన ఆదాల ఆఖరు నిమిషంలో తాను తప్పుకోలేనని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి సూచన మేరకే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చైతన్య రాజు చెప్పారు. చైతన్య రాజు తప్పుకున్నా ఆదాల తప్పుకోకపోవడంతో పోటీ తప్పడం లేదు.
ఏకగ్రీవమైతే వీరే..
ఆదాల కూడా ఉపసంహరించుకొని ఏకగ్రీవం అయితే కనుక కాంగ్రెసు పార్టీ నుండి కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బిరామి రెడ్డి, ఎంఏఖాన్, తెలుగుదేశం పార్టీ నుండి గరికపాటి మోహన రావు, సీతారామలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి కె కేశవ రావులు ఎన్నికయ్యేవారు.