చక్రి కావాలంటూ కన్నీరుమున్నీరు: హాస్పిటల్ అంటే భయమని..
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణాన్ని అతడి భార్య శ్రావణి జీర్ణించుకోలేకపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావడం లేదు. చక్రి కావాలంటూ ఆకాశన్నంటుతున్న ఆమె రోదనలు అందర్నీ కలచివేస్తున్నాయి. శ్రావణి కుటుంబసభ్యులు ఆమెను ఎంత ఓదార్చిన ఆమె కంట కన్నీరు ఆగడం లేదు.
చక్రి-శ్రావణిలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రావణిది కొత్తగూడెం. బీటెక్ చదివిన శ్రావణి చక్రీ సంగీతమంటే ఎంతో ఇష్టపడేది. వీరి వివాహం మే 14, 2006లో జరిగింది. వీరి ప్రేమ వివాహనికి శ్రావణి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే వీరి వివాహం శ్రావణి తాతయ్య దగ్గరుండి చేశారు.
చక్రి మరణంతో ఆయన కుటుంబంతోపాటు చక్రి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కంబాలపల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చక్రి సోదరుడు కన్నీరుమున్నీరయ్యారు. చక్రి స్నేహితుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా ఆయన మృతిని తట్టుకోలేకపోయారు. మీడియా మాట్లాడుతూ బోరున విలపించారు.
చక్రి అన్నయ్యకు హాస్పిటల్ అంటే భయం
డాక్టర్లు, హాస్పిటల్ అంటే భయంతోనే చక్రి అన్నయ్యకు హాస్పిటల్కు వెళ్లలేదని నటి హేమ అన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని తాను చాలా సార్లు అన్నయ్యకు చెప్పేదాన్ని అని, ఇదే విషయాన్ని వదిన(శ్రావణి)తో చాలా సార్లు అన్నట్లు ఆమె చెప్పారు. ఇటీవల ఎర్రబస్సు ఆడియోలో కలిసినప్పుడు అన్నయ్యను హాస్పిటల్కి తీసుకెళుతున్నానని శ్రావణి తెలిపినట్లు చెప్పారు.
చక్రికి సర్జరీ చేయిద్దామనుకుంటున్నట్లు.. ఇక నుంచి గ్లామర్గా కనిపిస్తారంటూ వదిన శ్రావణి తెలిపిందని హేమ చెప్పారు. చక్రి మరణవార్తను తాను నమ్మలేదని, ఈ విషమాన్ని సుమారు పదిమందికి ఫోన్ చేసి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని చక్రి కుటుంబసభ్యులు చెప్పినా.. రేపు వెళదామంటూ చెప్పారని, ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
కాగా, చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా అర్ధరాత్రి వరకు రికార్డింగ్ పనుల్లో అతను బిజీగా వున్నట్లు తెలుస్తోంది. రికార్డింగ్ పూర్తయిన బాగా పొద్దుపోయిన సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయారు. అయితే నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై.. తుది శ్వాస విడిచినట్లు వైద్యులు చెబుతున్నారు.